జగన్కు దూరం కావడానికి కారణం వెల్లడించిన సాయిరెడ్డి- బీజేపీలో చేరడంపైనా
Vijayasai Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరయ్యారు. మూడు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్టుగా అనుమానిస్తోన్న మద్యం కుంభకోణం వ్యవహారంలో ఈ విచారణను ఎదుర్కొంటోన్నారు.
మద్యం స్కాం అంశంలో విజయసాయిరెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిట్ నుంచి నోటీసులు అందుకున్నారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం సైతం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటీషన్ను దాఖలు చేసుకోగా.. ఆయనకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది సుప్రీం.

తాజాగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. విచారణ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్యం విషయంలో తాను జోక్యం చేసుకోలేదని అధికారులకు తెలియజేశానని అన్నారు. దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని, ఎప్పుడు పిలిచినా వస్తానని వారితో చెప్పినట్లు తెలిపారు.
రాజ్ కసిరెడ్డి కంపెనీలను ఏర్పాటు చేసినట్లు గానీ, కొత్త మద్యం బ్రాండ్లను తయారు చేసి విక్రయించిన విషయం గానీ తనకు తెలియదని అన్నారు. పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పాత్ర ఉందా? లేదా? అనేది కూడా తనకు తెలియదని సిట్ అధికారులకు స్పష్టం చేసినట్లు వివరించారు. తనకు అడిగిన ప్రశ్నలకు రాజ్ కసిరెడ్డి ఒక్కరే సరైన సమాధానం ఇవ్వగలరని వివరించినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్, అమరావతిలో ఏర్పాటైన సమావేశాల్లో గురించి కూడా తనకు పెద్దగా ఎలాంటి వివరాలు కూడా తెలియవని సిట్ అధికారులకు తెలియజేశానని సాయిరెడ్డి చెప్పారు. కిక్ బాక్స్ గురించి అధికారులు అడిగారని, దాని గురించి తనకు తెలియదని వివరించానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సాయిరెడ్డి సమాధానాలను ఇచ్చారు. పార్టీ అధికారంలో లేని సమయంలో అన్నీ తానే చూసుకున్నానని, సింగిల్ హ్యాండ్తో పార్టీని నడిపించానని అన్నారు. ప్రాంతీయ పార్టీల్లో నంబర్ 2 స్థానం అనేది ఉండదనే విషయం అధికారంలోకి వచ్చాక బోధపడిందని అన్నారు.
తనను ఓ వెన్నుపోటుదారుడిగా చిత్రీకరించి, జగన్కు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తరువాత నంబర్ 2 స్థానం నుంచి 2,000 స్థానం వరకు పడిపోయానని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీలో కొనసాగుతున్న కోటరీ ఉద్దేశపూరకంగా తనను పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్కు దూరం చేసినట్లు తాను భావిస్తోన్నానని అన్నారు.
వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన మీడియా సంస్థలో తనపై అనవసరంగా విమర్శలు చేస్తోన్నారని, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోన్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. ముసలోడు వ్యవసాయం చేస్తానన్నాడు.. ఇప్పుడు రాజకీయాల్లో రావాలనుకుంటున్నాడు అంటూ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు.
నేను వ్యవసాయం అయినా చేస్తాను, వ్యాపారం అయినా చేస్తాను. మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకుంటే వస్తాను. దీనికి ఒకరి పర్మిషన్ అవసరమా? అని ప్రశ్నించారు. మీడియా వాళ్లే తనను రాజ్యసభకు పంపిస్తున్నారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిని చేస్తున్నారు. బీజేపీ ఇన్ఛార్జీగా మరో రాష్ట్రానికి పంపిస్తున్నారు. మీరే ఏదేదో ఊహించుకుంటున్నారు.. అంటూ చెప్పారు. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఒకరి అనుమతి అక్కర్లేదని, ప్రస్తుతానికా తనకు ఆ ఉద్దేశం లేదని సాయిరెడ్డి తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications