అర్థం చేసుకోకుండా అవాకులు చెవాకులు రాయొద్దు- మెగాస్టార్ ఫైర్
అమరావతి: గతంలో తాను ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడ్డానంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. దీనిపై మీడియాలో భిన్నమైన కథనాలు రావడం పట్ల ఆయన షాక్కు గురయ్యారు. ఇలాంటి కథనాలు ప్రజలను గందరగోళానికి, ఆందోళనకు దారి తీస్తాయని పేర్కొన్నారు. తాను చెప్పిందొకటైతే.. రాసింది మరొకటి అంటూ మీడియాపై అసహనాన్ని వ్యక్తం చేశారు మెగాస్టార్.
ఈ సాయంత్రం హైదరాబాద్ నానక్రామ్ గూడలోని స్టార్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కేన్సర్ విభాగాన్ని చిరంజీవి ప్రారంభించారు. గతంలో తాను ఏఐజీ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా కేన్సర్ పాలిప్స్ ఉన్నట్లు తేలిందని, డాక్టర్లు సర్జరీ చేసి వాటిని తొలగించారని అన్నారు. కేన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండటం, ముందుగా దాన్ని గుర్తించి చికిత్స తీసుకున్నానని చిరంజీవి చెప్పారు. దీనిపై మీడియాలో వేర్వేరు కథనాలు వెలువడ్డాయి.

చిరంజీవికి కేన్సర్ సోకిందని, మెగాస్టార్ కేన్సర్ బారిన పడ్డారంటూ భిన్నమైన వార్తలు వచ్చాయి. దీనిపై మెగాస్టార్ అసహనాన్ని వ్యక్తం చేశారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో కొద్ది సేపటి కిందట దీనికి సంబంధించిన కొంత సమాచారాన్ని పోస్ట్ చేశారు. కేన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి తాను మాట్లాడానని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలను చేయించుకోవడం ద్వారా కేన్సర్ రాకుండా నివారించుకోవచ్చని సూచించానని అన్నారు.
తాను అప్రమత్తంగా ఉండి కొలోన్ స్కోప్ టెస్ట్ చేయించుకున్నానని, నాన్ క్యాన్సర్ పాలిప్స్ను డిటెక్ట్ చేసిన డాక్టర్లు వాటిని తీసేశారని తెలియజేసినట్లు చెప్పారు. అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద మారేదేమోనని మాత్రమే తాను చెప్పానని, అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు/ స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచించానని అన్నారు.

కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనా రాహిత్యంతో తాను క్యాన్సర్ బారిన పడ్డానని, చికిత్స వల్ల బతికానని అని స్క్రోలింగ్లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయని చిరంజీవి అన్నారు. దీనివల్ల అనవసరమైన గందరగోళం ఏర్పడిందని, అనేకమంది శ్రేయోభిలాషులు తన ఆరోగ్యం గురించి మెసేజీలు పంపిస్తోన్నారని చెప్పారు.
వారందరి కోసం ఈ క్లారిఫికేషన్ ఇస్తోన్నానని అన్నారు. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఒక విషయాన్ని విజ్ఞప్తి చేస్తోన్నానని, విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా అవాకులు చెవాకులు రాయవద్దని చిరంజీవి కోరారు. దీనివల్ల అనేకమందిని భయభ్రాంతులకు గురి చేసినట్టవుతుందని, వారిని బాధ పెట్టిన వారవుతారంటూ మెగాస్టార్ హితబోధ చేశారు.












Click it and Unblock the Notifications