అరుదైన వాటిల్లో అరుదు: అనూహ్య కేసుపై జడ్జి, 2,500 మందిని విచారించారు
ముంబై/మచిలీపట్నం: బందర్ టెక్కీ అనూహ్య హత్య కేసులో నిందితుడైన చంద్రభానుకు ముంబై ఫాస్ట్ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించడం పట్ల అనూహ్య తల్లితండ్రులు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారికి ఈ తీర్పు కనువిప్పుగా ఉందన్నారు.
దోషికి ఉరిశిక్ష పడుతుందని తాము భావించినట్లే తీర్పు ఇవ్వడంతో న్యాయమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు వెలువడిన నేపథ్యంలో పట్టణానికి చెందిన వివిధ రాజకీయ నాయకులు, మున్సిపల్ ఛైర్మన్ బాబా ప్రసాద్ తదితరులు అనూహ్య తల్లిదండ్రులతో కలిశారు.
కాగా, అనూహ్య అత్యాచారం, హత్య కేసులో ముంబై పోలీసులు 2500 మందిని విచారించారు. ఈ కేసు విచారణకు ఏడాదిన్నర పట్టింది. విచారణ చేసిన అధికారులు లోకమాన్య తిలక్ టెర్మినల్ రైల్వే స్టేషన్లోని36 సిసిటివీలను పరిశీలించారు. 2500 మందిని విచారించారు.
అనూహ్య కేసు విషయంలో స్పెషల్ మహిళా కోర్టు జడ్జి వృషాలీ జోషి తీర్పు చెబుతూ.... ఈ కేసు అరుదైన వాటిల్లో అరుదైనదిగా పేర్కొన్నారు. ఈ కారణంగా దోషికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు చెప్పారు. అతనికి ఉరేయాలన్నారు. కాగా, దీనిపై తాము పైకోర్టుకు వెళ్తామని చంద్రభాన్ తరఫు న్యాయవాది చెప్పారు.