పట్టాలపై ఆగిన బస్సుని చూసి రైలు ఆపిన డ్రైవర్, దూకిన ప్రయాణీకులు
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. రైలు పట్టాల పైన బస్సును చూసిన రైలు డ్రైవర్ దానిని ఆపడంతో ప్రమాదం తప్పింది. బుధవారం నాడు మధ్యాహ్నం పాతపట్నం వద్ద లెవల్ క్రాసింగ్ వద్ద రైలు వస్తున్నప్పటికీ గేటు పడలేదు.
రైలు వస్తోందనే విషయం తెలియక ఓ బస్సు రైలు పట్టాలను దాటుతోంది. ఈ సమయంలో... రైలు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు రైలు పట్టాల పైన ఉండటాన్ని రైలు డ్రైవర్ గుర్తించాడు. వెంటనే అతను తన పాసింజర్ రైలును ఆపేశాడు. ఆ సమయంలో బస్సులో 58 మంది ప్రయాణీకులు ఉన్నారు.
దగ్గరలోనే రైల్వే స్టేషన్ ఉండటంతో రైలు కొంత వేగం తగ్గి వస్తోంది. దీంతో డ్రైవర్ బస్సును గుర్తించి, ఆపగలిగాడు. ఆదే రైలు వేగంతో వస్తే ప్రమాదం జరిగేదని భావిస్తున్నారు. బస్సు రైలు పట్టాల పైన ఆగి ఉండటం, రైలు వస్తుండటంతో బస్సులోని పలువురు ప్రయాణీకులు బయటకు దూకేశారు.
బైకుల ఢీ: ముగ్గురికి గాయాలు
విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలం కారాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వేగంగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.