ప్రిన్సిపల్,టీచర్ పై నిర్భయ కేసు...విద్యార్థినులతో అసభ్య ప్రవర్తనకు ఫలితం
పశ్చిమగోదావరి: విద్యార్థులను క్రమశిక్షణతో నడిపిస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఆధ్యాపకులే అసభ్యంగా ప్రవర్తించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన గురువులే తప్పుదోవ పట్టారు. ప్రిన్సిపాల్, ఆధ్యాపకుడి వేధింపులు శృతిమించడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో ఆ కీచక గురువులపై నిర్భయ కేసు నమోదైంది.
ఆకివీడు మండలం దుంపగడపలోని ఏకేపీఎస్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ వరప్రసాద్, తెలుగు ఉపాధ్యాయుడు జాన్ వెస్లీ వెకిలిచేష్టల భాగోతం విద్యార్థినుల ఆందోళనతో వెలుగుచూసింది. ప్రిన్సిపాల్ వరప్రసాద్ ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు క్లాస్ రూంలో తలుపులు వేసి కొంతమంది విద్యార్థినులతో అసభ్యకర డ్యాన్సులు వేయిస్తున్న దృశ్యాలు కూడా బయటపడ్డాయి. ప్రిన్సిపల్ వరప్రసాద్, తెలుగు ఉపాధ్యాయుడు జాన్ వెస్లీలైగింకంగా వేధించడంతో పాటు వారి మాట వినకపోతే చాలా టార్చర్ పెట్టేవారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
గురువులు...
కీచక గురువులు...
ప్రిన్సిపల్ వరప్రసాద్, తెలుగు ఉపాధ్యాయుడు జాన్ వెస్లీ ఆగడాలు అంతకంతకు ఎక్కువవుతుండటంతో తట్టుకోలేని విద్యార్థినులు ఆందోళనకు దిగారు.అసభ్యంగా ప్రవర్తించిన గురువును సస్పెండ్ చేయాలంటూ ధర్నా నిర్వహించారు. దీంతో కాలేజ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థినుల ఆందోళనకు విద్యార్థిసంఘాలు మద్దుతు పలికాయి. వెకిలిచేష్టలకు పాల్పడిన ప్రిన్సిపాల్, తెలుగు లెక్చరర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామని విద్యార్ధులు హెచ్చరించారు. విద్యార్థినుల ఆందోళన విషయం పోలీసులకు తెలియడంతో వారు కళాశాల వద్దకు చేరుకున్నారు. అనంతరం ఇంటర్ చదువుతున్నఒక విద్యార్థిని ఫిర్యాదు ఆధారంగా ప్రిన్సిపల్తోపాటు తెలుగు ఆధ్యాపకుడు జాన్ వెస్లీ పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆరోపణలు...
విద్యార్థినుల ఆరోపణలు...
ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ కొన్ని నెలలుగా తెలుగు అధ్యాపకుడు జాన్వెస్లీతో పాటు కళాశాల ప్రిన్సిపల్ ఎం.వరప్రసాద్ తమతో ద్వందార్థాలు వచ్చేలా మాట్లాడటంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తిసున్నారని తెలిపారు. వీరి చేష్టల కారణంగా ఇప్పటికే అనేకమంది కళాశాలకు రావటం మానేశారని, మరికొందరు టీసీలు తీసుకొని వెళ్లిపోయారని చెప్పారు. విషయం ఇంటి వద్ద చెబితే చదువు మాన్పిస్తారనే భయంతో తాము చెప్పలేదని వాపోయారు. ఆ ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

కళాశాల ప్రిన్సిపల్ వరప్రసాద్ మాట్లాడుతూ బుధవారం తాను కళాశాలకు సెలవు పెట్టానని, అదే సమయంలో తెలుగు అధ్యాపకుడు జాన్వెస్లీ తరగతి గదిలో అసభ్యకరంగా ప్రవర్తించారని, మొబైల్ ద్వారా తనకు సమాచారం అందినట్లు తెలిపారు. గురువారం కళాశాలకు వచ్చిన కొద్దిసేపటికే ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు ఆందోళనకు దిగారన్నారు. అంతే తప్ప తాను ఏ తప్పుచేయలేదన్నారు. తెలుగు అధ్యాపకుడు జాన్వెస్లీ మాట్లాడుతూ కావాలనే కొందరు తనపై అప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications