సీఎం జగన్ వ్యక్తిగత అజెండా వల్లే విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం: మండిపడిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ప్రభుత్వంపై దశల వారి పోరాటానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెంపును ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని దిశానిర్దేశం చేసిన చంద్రబాబు జగన్ రెడ్డి అధికారం చేపట్టిన మూడు సంవత్సరాలలో ఏడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

సీఎం జగన్ వ్యక్తిగత అజెండాతో విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తున్నారు: చంద్రబాబు
ఏడు దశల్లో ప్రజలపై 12 వేల కోట్ల రూపాయల భారం మోపారని చంద్రబాబు మండిపడ్డారు. ఇక ఇదే సమయంలో సీఎం జగన్ వ్యక్తిగత అజెండాతో విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పి, ప్రజలపై ఏకంగా 42,172 కోట్ల రూపాయల భారం మోపారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ లో ఉన్న విద్యుత్ రేట్ల నేపథ్యంలో పరిశ్రమలు ముందుకు రావడం లేదని పేర్కొన్న చంద్రబాబు, కేవలం సంపన్న వర్గాల కోసమే జగన్ ప్రభుత్వం పని చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.

టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ చార్జీలు తగ్గించే వాళ్ళమన్న చంద్రబాబు
రాష్ట్రస్థాయి నుండి గ్రామ స్థాయి వరకు నిరసనలు చేపట్టే పోరాటానికి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించే వాళ్లమని వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరంతర విద్యుత్ ను ఇచ్చామని, కానీ ఇప్పుడు విద్యుత్ కోతలు విధిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సౌర విద్యుత్, పవన విద్యుత్ దెబ్బతిన్నాయని చంద్రబాబు విమర్శించారు.
Recommended Video


జగన్ రెడ్డి అసమర్థత, అవినీతి వల్ల విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తం
జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యుత్ కొరత నెలకొందని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ రెడ్డి అసమర్థత వల్ల, అవినీతి వల్ల విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని మండిపడిన చంద్రబాబు కార్పొరేషన్ ద్వారా 25 వేల కోట్లకుపైగా అప్పు తెచ్చి ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరి తాడు బిగిస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications