సీఎం జగన్ చిత్రపటానికి బంగారు పూలాభిషేకం - అక్కడ ఎప్పుడూ ప్రత్యేకమే: అరుదైన ఘటనతో..!!
ముఖ్యమంత్రి పైన అభిమానం ప్రదర్శించటంలో ఆ నియోజకవర్గం ఎప్పుడూ ప్రత్యేకమే. ఇప్పుడు మరోసారి అరుదైన ఘటనతో సీఎం పైన అభిమానం ఏ స్థాయిలో ప్రదర్శించారనేది వార్తల్లో నిలిచింది. ఎంతో కాలంగా ఏపీ ఉద్యోగులు..పెన్షనర్లు పీఆర్సీ కోసం నిరీక్షిస్తున్నారు. తాజాగా, ముఖ్యమంత్రి జగన్ పీఆర్సీ ప్రకటన సమయంలో ఉద్యోగులకు అనేక వరాలు ప్రకటించారు. దీని పైన రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా.. ఉద్యోగులు మాత్రం పలు ప్రాంతాల్లో సంబురాలు చేసుకుంటున్నారు.
జగన్ పై అభిమానంలో ఎప్పుడూ ప్రత్యేకతే
ఇక, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సీఎం జగన్ పైన అభిమానం చాటుకోవటంతో అక్కడి స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి వరకు వినూత్న కార్యక్రమాలు నిర్వహించగా.. ఇప్పుడు స్థానికంగా ఉన్న ఉద్యోగులు చూపించిన అభిమానం మరోసారి వైరల్ అవుతోంది. గతంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూధనరెడ్డి ట్రాక్టర్ల ర్యాలీ.. నవరత్నాల పేరుతో ఏకంగా గుడి నిర్మాణం వంటి వాటితో వార్తల్లో నిలిచారు. ఇప్పుడు కాళహస్తిలో ఉద్యోగులు సీఎం జగన్ చిత్రపటానికి బంగారు పూలతో అభిషేకం నిర్వహించారు. పాలాభిషేకం సైతం చేసారు.
బంగారు పూలతో అభిషేకం నిర్వహించి
ప్రభుత్వం 23 శాతం ఫిట్మెంట్ ప్రకటించడమే కాకుండా రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచినందుకు ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్కు వారు ధన్యవాదాలు తెలియజేశారు. తాము ఊహించిన దానికంటే ఎక్కువగానే సీఎం జగన్ వరాలు కురిపించారంటూ సంబరపడిపోయారు. ముఖ్యమంత్రి జగన్ పీఆర్సీ పైన తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగుల పక్షపాతి అని నిరూపించుకున్నారని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పుకొచ్చారు. అదే విధంగా ఉద్యోగులు కోరకుండానే...అనూహ్యంగా పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారంటూ హర్షం వ్యక్తం చేసారు.
పీఆర్సీ ప్రకటనపై సంతోషంతో
పెంచిన పీఆర్సీని సైతం ఈ నెల నుంచే అమలు చేయటం.. పెండింగ్ నాలుగు డీఏలు సైతం ఈ నెల జీతంతో పాటే అందిస్తామని చెప్పటం సైతం మేలు చేసే నిర్ణయాలుగా పేర్కొంటున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు కృతజ్ఞతలు ఈ రకంగా చెప్పుకుంటున్నామని స్థానిక ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.
అయితే, ఏకంగా బంగారు పూలతో సీఎం చిత్రపటానికి అభిషేకం చేయటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇతర జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో సీఎం పీఆర్సీ ప్రకటన తరువాత ఆయన చిత్రపటానికి పూలాభిషేకం వంటివి నిర్వహించారు. కానీ, ఏకంగా బంగారు పూలతో అభిషేకం మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోయింది.