నోటుకు ఓటు కేసులో జగన్ చానెల్ ఎక్విప్మెంట్ వాడారు: కాల్వ
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఉపయోగించిన ఎక్విప్మెంట్ అంతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చానల్కు సంబంధించినదేనని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. త్వరలోనే ఈ విషయాలన్నీ బయటపడతాయని ఆయన అన్నారు.
రాష్ట్రాభివృద్ధిని అడ్డుకున్న వారితో జగన్ చేతులు కలపడం దారుణమని మంత్రి రావెల కిశోర్బాబు వ్యాఖ్యానించారు. కేసీఆర్తో రహస్య ఒప్పందం కుదుర్చుకొని జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో జగన్ చేస్తున్న కుట్రను ప్రజలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్, టీఆర్ఎస్తో జగన్ లాలూచీ పడుతున్నారని మరో మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు.
కడపలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే వారి పోస్ట్మార్టం కూడా హైదరాబాద్లో నిర్వహించాలని కోరడాన్ని బట్టి ఆయనకు తెలంగాణ ప్రభుత్వంపై ఎంత ప్రేమ ఉందో స్పష్టమవుతోందన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో టీఆర్ఎస్కు జగన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)గా వ్యవహరించారని, శుక్రవారం నాటి సమావేశాల్లో తేటతెల్లమైందని కూన రవికుమార్ ఆరోపించారు.
జగన్కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఆంధ్ర విద్యుత్ ఉద్యోగులను తొలగించినపుడు, సెక్షన్ 8 గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పక్క రాష్ర్టాల్లో జరిగిన కేసులు గురించి ఏపీ అసెంబ్లీలో ప్రస్తావించడం అవివేకమని బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
కెసిఆర్ ఎజెండాను ఇక్కడ జగన్ అమలు చేస్తున్నారని, ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే కుట్రతోనే ఈవిధంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఏపీలో జగన్ తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పక్క రాష్ర్టాలకు ప్రతిపక్షం బినామీగా వ్యవహరిస్తున్నదని యామిని బాల ఆరోపించారు.