బాబుని తిట్టి, జగన్ చెప్పాడనే జ్యోతిపై: కెసిఆర్పై ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తిట్టి పబ్బం గడుపుకుంటున్నాడని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం మండిపడ్డారు. ప్రగల్భాలు, ఉపన్యాసాలు తప్ప ఒక్క పరిశ్రమైనా కేసీఆర్ తెచ్చారా అని ప్రశ్నించారు.
కేంద్రంతో తగువుపెట్టుకోవాని చూసే పనులు మానాలన్నారు. తెలంగాణలో ఉన్న వారంతా తెలంగాణ ప్రజలేనని, వారందర్నీ కాపాడే ప్రయత్నం చేయాలన్నారు. లేనిపక్షంలో మరో ఉద్యమం ఊపిరిపోసుకుంటుందని హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినందువల్లే టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలపై కేసీఆర్ కక్ష సాధింపు చేపట్టారని ఆరోపించారు. తన అవినీతిని బయటపెట్టినందువల్లే వీటిని ఆపాలని కేసీఆర్ను జగన్ కోరారన్నారు.

చైర్మన్ ఎన్నికపై డిఎస్
స్థానిక ఎన్నికలకు ముందు చైర్మన్ ఎన్నిక సరికాదని, దీనిని వాయిదా వేయాలని తాము గవర్నర్ను కోరుతామని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేత డి శ్రీనివాస్ వేరుగా చెప్పారు.
తెరాస లోపాయకారి వ్యవహారాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మండలిలో అధికారికంగా మెజార్టీ తమదే అన్నారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ ఎన్నిక ఇంత అత్యవసరంగా నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలన్నారు. ప్రభుత్వం ఇంత అత్యవసరంగా సమావేశాలకు పిలవాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.
టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ విప్
జులై 3వ తేదీ నుంచి జరగనున్న మేయర్, మున్సిపల్ ఛైర్మన్, ఎంపీపీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు విప్ జారీ చేశాయి. స్థానిక సంస్థల ఛైర్మన్ల ఎంపికలో పార్టీ సూచించిన వారికే ఓటు వేయాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications