కిరణ్తో డ్రామాలు: ఎర్రబెల్లి, దారి చూసుకో: షబ్బీర్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రిపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశారని ఆరోపించారు. అబద్దాలు మాట్లాడి సీమాంధ్రుల మెప్పుపొంది సమైక్యాంధ్ర హీరో కావాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఆనాడు రోశయ్యతో ఈనాడు కిరణ్తో కాంగ్రెస్ డ్రామాలాడిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్కు చిత్తశుద్ది ఉంటే సీఎం కిరణ్, బొత్సలను బహిష్కరించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అబద్దాలు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేయొద్దని హెచ్చరించారు. సమైక్య ఉద్యమానికి నాయకుడు కావాలనుకుంటే కిరణ్ సీఎం పదవికి రాజీనామా చేయాలని గుత్తా సుఖేందర్రెడ్డి డిమాండ్ చేశారు.
సిడబ్ల్యుసి నిర్ణయానికి ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి కట్టుబడి ఉండాలని, లేదంటే తన దారి తాను చూసుకోవాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నేత షబ్బీర్ అలీ అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించుకుంటే కిరణ్ కుమార్ రెడ్డిని తాము ముఖ్యమంత్రిగా అంగీకరించబోమని ఆయన శనివారం అన్నారు.
నీటి సమస్వలంటూ కిరణ్ కుమార్ రెడ్డి చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని, ఏనాడైనా అధిష్టానానికి ఆ సమస్యను అధిష్టానానికి చెప్పారా అని ఆయన అన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించి హీరో కావాలని సిఎం అనుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.