టీఆర్ఎస్ నేతలపై తిరగబడ్తారు: ఎర్రబెల్లి, అది కమిషన్ కాకతీయ: యాష్కీ
హైదరాబాద్/ కరీంనగ్/ నిజామాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నేతలపై ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని తెలంగాణ తెలుగుదేశం శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఎర్రబెల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎర్రబెల్లి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్, ఇతర నేతలు పాల్గొన్నారు.
రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రమేష్ రాథోడ్ అన్నారు. ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. శనివారం నాడు టీడీపీ జిల్లా మహాసభలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయలో అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్రతో రాష్ట్ర రైతులకు ఒరిగిందేమీ లేదని అన్నారు. కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు విజయ రమణారావు మాట్లాడుతూ - తెలంగాణ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని అన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ప్రజా కోర్టులో నిలబెడతామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయగా మారిందని తెలంగాణ కాంగ్రెస్ నేత మధుయాష్కి ఆరోపించారు. శనివారం నిజామాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు శాతం కమీషన్ వసూలు చేస్తున్నారన్నారు. ఆంధ్రా సాకుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గొంతు నొక్కినట్లు తమ గొంతు నొక్కొలని చూస్తే ఊరుకునేది లేదని మధుయాష్కి స్పష్టం చేశారు.