ఎర్రన్నాయుడి విగ్రహ ఏర్పాటుకు అడ్డు, బాబు హెచ్చరిక
కుశాలపురం రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 78లో జాతీయ రహదారి కి చెందిన డివైడర్పై ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ ఏర్పాటు విషయాన్ని తెలుసుకొని శ్రీకాకుళం ఆర్డీవో గణేష్ కుమార్ పరిస్థితిని సమీక్షించారు. తహశీల్దార్, మండల సర్వేయర్ తదితరులు కూడా పరిశీలించారు. ఎర్రన్నాయుడు విగ్రహ ఏర్పాటుకు ఎటువంటి అనుమతుల్లేవని అధికారులు తెలిపారు. దీనిపై టిడిపి నాయకులు తీవ్రంగా స్పందించారు.
గతేడాది నవంబర్ 2న ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారని, అదే ఏడాది న వంబర్ 11న సంస్మరణ సభను నిర్వహించగా, జాతీయ, రాష్ట్ర నేతలు హాజరయ్యారని పేర్కొన్నారు. ఆ సంస్మరణలో సభలో ఎర్రన్నాయుడు గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని నేతలంతా ముక్తకంఠంతో చెప్పారని గుర్తు చేశారు.
గతేడాది నవంబర్ 12న శ్రీ కాకుళం పట్టణంలో రామలక్ష్మణ, సూర్యమహల్ జంక్షన్లో ఏదో ఒక చోట ఎర్రన్నాయుడు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ ను కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించామని తెలిపారు. దీనిపై అధికారుల నుంచి స్పందనలేదన్నారు. ఆ తర్వాత సూర్యమహల్ జంక్షన్లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆఘమేఘాల మీద ఏర్పాట్లు చేశారన్నారు. వివేకానంద విగ్రహం ఏర్పాటును తాము వ్యతిరేకించడం లేదన్నారు. అయితే అధికారుల తీరు ఆక్షేపణీయమని, అధికార పార్టీ నేతల అడుగులకు మడుగలు ఒత్తుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఎర్రన్నాయుడి విగ్రహాన్ని తొలగించాలని ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. విగ్రహాన్ని తొలగిస్తే ప్రజలు తిరగబడతారన్న విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు. పదిరోజుల్లో తొలగించాలని అధికారులు ఆదేశించారు. తొలగించేది లేదని తెలుగు తమ్ముళ్లు భీష్మించారు. మరోవైపు విగ్రహాన్ని తొలగించాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.