అచ్చెన్నది అల్లాటప్పా స్కామ్ కాదు: కార్మికుల అకాల మరణానికీ లింకు: బాధ్యత బాబుదే: సాయిరెడ్డి
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత, కార్మికశాఖ మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టు ఉదంతం..రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలను సృష్టిస్తోంది. కార్మికశాఖ మంత్రిగా ఈఎస్ఐలో నాసిరకం వైద్య పరికరాలు, మందులను కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. పోలీసుల అదుపులో ఉంటూ ప్రస్తుతం ఆయన గుంటూరు జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ కార్మికుల మరణాలపై ఆరా..
ఈఎస్ఐ కుంభకోణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి సరికొత్త డిమాండ్ను లేవనెత్తారు. అచ్చెన్నాయుడి హయాంలో కొనుగోలు చేసిన నాసిరకం వైద్య పరికరాలు, మందుల వల్ల పలువురు కార్మికులు ప్రాణాలను కోల్పోయారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అయిదేళ్ల కాలంలో ఈఎస్ఐ ఆసుపత్రుల్లో నమోదైన కార్మికుల మరణాలకు సంబంధించిన పూర్తి వివరాలను వెలికి తీయాల్సి ఉంటుందని అన్నారు.
నాసిరకం మందులు.. నకిలీ డయాగ్నస్టిక్ కిట్ల వల్లే..
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించిన కార్మికుల వివరాలను ఆ సంస్థ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దీనికోసం ప్రభుత్వం తరఫున అన్ని చర్యలను తీసుకుంటామని అన్నారు. అయిదేళ్ల కాలంలో అనారోగ్యానికి గురై, చికిత్స కోసం ఈఎస్ఐ ఆసుపత్రుల్లో చేరి, మరణించిన వారి జాబితా, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని అన్నారు. అచ్చెన్నాయుడు కుంభకోణానికి పాల్పడి నాసిరకం మందులు, నకిలీ డయాగ్నిస్టిక్ కిట్లు అమాయక కార్మికుల మరణానికి కారణమని చెప్పారు.
ఆ ముగ్గురిదే బాధ్యత..
నకిలీ డయాగ్నస్టిక్స్ కిట్స్ వల్ల సకాలంలో ఈఎస్ఐ డాక్టర్లు తమ ఆసుపత్రిలో చేరిన కార్మికుల రోగాన్ని సకాలంలో గుర్తించలేకపోయారని అన్నారు. ఫలితంగా వ్యాధి ముదిరి వారు మరణించారని అన్నారు. కార్మికుల అకాల మరణాలకు అచ్చెన్నాయుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాల్సి ఉంటుందని సాయిరెడ్డి డిామాండ్ చేశారు.
కార్మికుల ప్రాణాలతో చెలగాటం..
ఈఎస్ఐ ఆసుపత్రుల మీద ఆధారపడి వైద్య చికిత్సలను చేయించుకునే కార్మికులందరూ చిరు వేతనాలను పొందే వారని అన్నారు. వారి వేతనం నెలకు 20 వేల రూపాయల లోపే ఉంటుందని అన్నారు. అలాంటి కార్మికులు తమ ఈఎస్ఐ సభ్యత్వం కింద ప్రతినెలా 50 నుంచి 70 రూపాయల మొత్తాన్ని చెల్లిస్తుంటారని చెప్పారు. తక్కువ వేతనాలను పొందే కార్మికులు లక్షల రూపాయలను ధారపోసి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స చేయించుకోలేరని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో ప్రమాదానికి గురైనా, అనారోగ్యానికి గురైనా వారికి వెంటనే గుర్తుకు వచ్చేది ఈఎస్ఐ ఆసుపత్రి మాత్రమేనని సాయిరెడ్డి అన్నారు.
రూ.900 కోట్ల కుంభకోణం
అలాంటి చిరు ఉద్యోగులు, రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడే కార్మికులు నాణ్యమైన వైద్యం దొరుకుతుందనే ఆశతో ఈఎస్ఐ ఆసుపత్రుల్లో చేరుతుంటారని గుర్తు చేశారు. అలాంటి కార్మికుల ఉసురు తీశారని ఆయన మండిపడ్డారు. వారికి నాణ్యమైన వైద్యాన్ని అందించకపోగా.. ప్రాణాలతో చెలగాటం ఆడారని అన్నారు. 900 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన అచ్చెన్నాయుడు కార్మికుల ఉసురు తీశారని విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తమ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తుందని అన్నారు.