"చిరు - చరణ్" సరికొత్త రికార్డ్.. భారత చలనచిత్ర చరిత్రలోనే ఫస్ట్ టైమ్ !
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఏ తండ్రీకొడుకులకూ సాధ్యం కాని ఓ అరుదైన ఘనతను మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ సాధించారు. ఒకే ఏడాదిలో ఇద్దరూ తమ తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ₹300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. వరుసగా బ్లాక్బస్టర్ విజయాలు అందుకోవడంతో ప్రస్తుతం మెగా కుటుంబంతో పాటు అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.
గత కొన్నేళ్లుగా మెగా అభిమానులు కొన్ని ఊహించని పరాజయాలతో నిరాశకు గురయ్యారు. అయితే ఈ ఏడాది మాత్రం మెగా క్యాంప్కు పూర్తిగా కలిసి వచ్చింది. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకరి వెనుక ఒకరు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. #MegaBlockbusterYear, #ChiruCharan300CrClub వంటి హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అవుతున్నాయి.

'మన శంకర వరప్రసాద్'తో మెగాస్టార్..
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్' చిత్రం ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. గత చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది. కానీ ఈ సినిమాతో చిరంజీవి తన వింటేజ్ మాస్ ఇమేజ్ను మరోసారి గుర్తుచేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వినోదం, ఎమోషన్స్, మాస్ ఎలివేషన్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్, డ్యాన్స్లు, యాక్షన్ సీక్వెన్స్లు అభిమానులను మళ్లీ 90ల మెగాస్టార్ను గుర్తు చేశాయి. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి మెగాస్టార్ ఈజ్ బ్యాక్ అని చాటిచెప్పింది.
'పెద్ది'తో రామ్ చరణ్ గ్లోబల్ సంచలనం
తండ్రి విజయంతో మెగా కుటుంబం ఆనందంలో ఉండగానే, ఆ ఆనందాన్ని మరింత రెట్టింపు చేశాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' విడుదలైన తొలి రోజు నుంచే సంచలన స్పందనను సొంతం చేసుకుంది. గ్రామీణ నేపథ్యంలో క్రీడా స్పూర్తి, భావోద్వేగాలు, మాస్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక క్రాస్ఓవర్ అథ్లెట్ పాత్రలో కనిపించారు. క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి విభిన్న క్రీడల్లో రాణించే యువకుడిగా ఆయన చూపించిన నటనకు ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రత్యేకంగా చరణ్ ఊరమాస్ మేకోవర్, ఎమోషనల్ సన్నివేశాల్లో నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, శివరాజ్కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో మెప్పించారు. భారీ ఓపెనింగ్స్తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ₹300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం కేవలం కమర్షియల్ విజయమే కాదు, నటుడిగా రామ్ చరణ్ పరిధిని మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా కూడా నిలుస్తోంది.
గతంలో ఎన్నో స్టార్ కుటుంబాలు ఉన్నప్పటికీ, ఒకే ఏడాదిలో తండ్రీకొడుకులు ఇద్దరూ ఇలాంటి భారీ విజయాలను నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ విజయాలతో మెగా బ్రాండ్ విలువ మరింత పెరిగిందని, పాన్ ఇండియా మార్కెట్లో చిరంజీవి-రామ్ చరణ్ క్రేజ్ మరో స్థాయికి చేరుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తండ్రీకొడుకుల డబుల్ బ్లాక్బస్టర్ విజయాలతో మెగా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.












Click it and Unblock the Notifications