సారీ చెప్పను- ఆయన్ను తప్పించాల్సిందే- మోడీకి రాహుల్ డిమాండ్..!
ఢిల్లీలో ఈ నెల 20న విద్యార్ధులు చేపట్టిన పార్లమెంట్ మార్చ్ పై పోలీసుల బలప్రయోగానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాయే ఆదేశాలు ఇచ్చారంటూ లోక్ సభలో ఆరోపించిన విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. లోక్ సభలో తన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగానే స్పీకర్ సభను వాయిదా వేయడం, తిరిగి రాగానే పేపర్ లీక్ ల నిరోధక బిల్లును మూజువాణి ఓటుతో కేంద్రం ఆమోదింపజేసుకోవడంపై రాహుల్ మండిపడ్డారు.
లోక్ సభలో తనను మాట్లాడే అవకాశం కల్పించలేదని ఆరోపిస్తూ.. సాయంత్రం ప్రెస్ మీట్ కమ్ ప్రజంటేషన్ ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ.. హోం మంత్రి అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి పిలుపునిచ్చారు.
క్షమాపణ చెబితే తన ప్రసంగాన్ని కొనసాగించడానికి అనుమతిస్తారని తనకు హామీ లభించిందని విపక్ష నేత రాహుల్ పేర్కొన్నారు. కానీ తాను బీజేపీకి గానీ, ఆర్ఎస్ఎస్కు గానీ ఎప్పటికీ క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు. రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజులకు పలుమార్లు మాట్లాడేందుకు అవకాశం కల్పించారని, తాను క్షమాపణ చెబితే, కొనసాగేందుకు అనుమతిస్తామన్నారని గుర్తుచేశారు.

విశాల దృక్పథంతో ఉండి ప్రశ్నలు అడిగే మన విద్యార్థులపై క్రూరంగా ప్రవర్తించారని, తన దృష్టిలో ఈ రోజు అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఇదే అన్నారు. విద్యార్థులపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపారని, ఒక విద్యార్థి ఒక కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆరోపించారు. అతనిపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపినట్లు నిర్ధారించే ఎయిమ్స్ వైద్య ధృవీకరణ పత్రాన్ని తాను చూసినట్లు రాహుల్ వెల్లడించారు. నిరసనకారులపై, ముఖ్యంగా మహిళలు, మైనర్లపై అణచివేత సమయంలో పోలీసులు షాక్ బ్యాటన్లు, మేకులున్న లాఠీలు వాడారని రాహుల్ ఆరోపించారు. నిరసన సమయంలో అమిత్ షా పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం తాను స్వయంగా చూశానని రాహుల్ తెలిపారు.












Click it and Unblock the Notifications