పొట్టి శ్రీరాములే ఆదర్శం: ఈటెల, కిరణ్పై వ్యాఖ్య
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని సంకుచితమైందిగా చూశారు కాబట్టే సీమాంధ్ర నాయకులు చేతులు కాల్చుకున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చలో పాల్గొంటూ ఆయన శుక్రవారం శాసనసభలో ఆయన ప్రసంగించారు. రాజకీయ అవసరాల గురించే తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు కావచ్చు గానీ తెలంగాణ ప్రజల కల సాకారమవుతోందని ఆయన అన్నారు.
తెలంగాణ ఉద్యమం సంకుచితమైంది, చిన్నది కాదని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లును సంపూర్ణంగా ఆమోదిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని పాలించిన సీమాంధ్ర నేతలు తెలంగాణ ప్రజల మనసు దోచుకోలేకపోయారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని రాగద్వేషాలతోనే పాలించారని ఆయన విమర్శించారు. పొట్టి శ్రీరాములు తమకు ఆదర్శమని, చిన్న రాష్ట్రాల కోసం పోరాటం చేశారని, మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవాలని కోరారని ఆయన అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసి ప్రాణాలర్పించిన త్యాగజీవి పొట్టి శ్రీరాములు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ అవతరణకు పొట్టి శ్రీరాములుకు సంబంధం లేదని ఆయన అన్నారు. ఈ సమయంలో సీమాంధ్ర శాసనసభ్యులు అభ్యంతం తెలిపారు. తాము రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమం చేస్తే సంఘద్రోహులు, దేశ ద్రోహులు అన్నారని, మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రజలను ద్వితీయశ్రేణి పౌరులుగా చూస్తున్నారని, మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవడమే పరిష్కారమని అయ్యదేవర కాళేశ్వర రావు అన్నారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు.
పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పోరాటం చేశారని తాను చెప్పినట్లు ఈటెల అన్నారు. భాషథ మాత్రమే ప్రాతిపదిక కాకూడదని రాజ్యాంగ రచన చేసినవారు అన్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణను కలిపితే ఆ ప్రాంత ప్రజలు తట్టుకునే పరిస్థితి లేదని ఫజల్ అలీ చెప్పినట్లు ఆయన తెలిపారు. తమది మూడు తరాల ఉద్యమమని ఆయన అన్నారు. విశాలాంధ్ర ఏర్పాటు ప్రయత్నాల్లో సామ్రాజ్యవాద కుట్ర ఉందని జవహర్ లాల్ నెహ్రూ చెప్పారని ఆయన అన్నారు. అన్నింటినీ తుంగలో తొక్కి విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ఆయన అన్నారు.
1969లో తమ ప్రాంత విద్యార్థులు తెలంగాణ కోసం రక్తతర్పణ చేశారని, తమది మూడు తరాల ఉద్యమమని, ఎవరినీ తమకు వ్యక్తిగతంగా విమర్శించే ఉద్దేశం లేదని ఆయన అన్నారు. ముస్లింలకు ఖురాన్, హిందువులకు భగవద్గీత ఎంత పవిత్రమైందో తెలంగాణవాళ్లకు తెలంగాణ బిల్లు అంత పవిత్రమైందని, దాన్ని సీమాంధ్ర సభ్యులు చించేశారని ఆయన అన్నారు. తాము అలీనాన్ని మాత్రమే కోరుతున్నట్లు ఆయన తెలిపారు. చిలకపలుకులు మాని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గతంలో చెప్పినదానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు.
ఆంధ్రలో ఏ ప్రాంతాన్ని కోరారో ఆ ప్రాంతమే కావాలని ఈటెల అంటున్నారని, భద్రాచలం అప్పుడు తెలంగాణలో లేదని, ఇప్పుడు దాన్ని అంగీకరిస్తారా అని మంత్రి మాణిక్యవరప్రసాద్ అన్నారు. భద్రాచలం గుడిని కట్టించింది గోపన్న అనే విషయాన్ని మరిచిపోకూడదని, నిజాం నవాబు జైలులో ఉన్నారని, రామభద్రుడికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు పంపించింది తానీషా అని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రాంతాలు ఈ ప్రాంతానికి చెందాలని ఈటెల రాజేందర్ అన్నారు. 1956కు ముందు భద్రాచలం తెలంగాణలో లేదని ఆయన అన్నారు.
తాము విశాలాంధ్రను కోరుకున్న మాట వాస్తవమేనని, అయితే ఇంత అన్యాయం జరుగుతుందని తాము ఊహించలేదని పుచ్చలపల్లి సుందరయ్య అన్నట్లు ఈటెల రాజేందర్ చెప్పారు. సీమాంధ్ర సభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ సమయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎవరినీ ఎవరూ రెచ్చగొట్టకుండా అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అయినా సభ సద్దుమణగలేదు. సమైక్య, తెలంగాణ నినాదాలు సభలో వినిపించాయి.
తెలంగాణ బతుకులను బోర్ల బావుల బతుకులుగా మార్చారని ఆయన అన్నారు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే విద్యే ముఖ్యమని, తెలంగాణకు ఉన్నవి ఓయు, కెయు మాత్రమేనని ఆయన అన్నారు. గోదావరిలో తమ వాటా 79 శాతం అయితే తమ ప్రాంతానికి 17 శాతం మాత్రమే అందుతున్నాయని ఆయన అన్నారు. ఆంధ్రతో కలిసి ఉండడం వల్ల తెలంగాణ తన నదీ జలాల్లో తన వాటాను కోల్పోయిందని ఆయన అన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలను తరలించుకుపోయారని ఆయన అన్నారు. కృష్ణా నది జలాల్లో తెలంగాణకు అందుతున్నది కేవలం 15.4 శాతం మాత్రమేనని ఆయన అన్నారు. జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులున్నా నీరు లేక తెలంగాణ ప్రాంత ప్రజలు వలస కూలీలుగా మారుతున్నారని ఆయన అన్నారు. వివిధ రంగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆయన వివరించారు. తెలంగాణ వెనకబడ్డ ప్రాంతం కాదని, వెనక్కి నెట్టేయబడిన ప్రాంతమని ఆయన అన్నారు. 610 జీవోను అమలు చేయలేని సమైక్య ప్రభుత్వం కలిసుండాలని ఎలా అంటుందని ఆయన అన్నారు.
తెలంగాణ పరిశ్రమలను విక్రయించి సోకులు చేసుకున్న చరిత్ర సీమాంధ్ర పాలకులదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications