ఎందరో ముఖ్యమంత్రులను కలిశాను కానీ- సొంతింటికి వచ్చా: సజ్జన్ జిందాల్ కీలక వ్యాఖ్యలు
కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్.. ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ ను సజ్జన్ జిందాల్ ప్రశంసించారు.
కడప: కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో ఇవ్వాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జేఎస్డబ్ల్యూ స్టీల్స్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్.. ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ ను సజ్జన్ జిందాల్ ప్రశంసించారు. జగన్ వంటి డైనమిక్ ముఖ్యమంత్రి ఉండడం ఏపీ అదృష్టమని అన్నారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో సొంత ఇంటికి తిరిగి వచ్చినట్లనిపిస్తోందని పేర్కొన్నారు. వైఎస్ కుటుంబంతో తనకు సుదీర్ఘకాల అనుబంధం ఉందని వ్యాఖ్యానించారు.

చాలామంది సీఎంలను కలిశాను..
తాను దేశంలో అనేక రాష్ట్రాలు తిరిగానని, చాలామంది ముఖ్యమంత్రులను కలిశానని, వారందరూ వైఎస్ జగన్ పేరును, ఇక్కడి పరిపాలనను ప్రస్తావించారని చెప్పారు. ఎవ్వరూ ఊహించని విధంగా జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్లు, గ్రామ సచివాలయాల వ్యవస్థలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆకట్టుకుంటున్నాయని అన్నారు. జగన్ సారథ్యంలో మూడు సంవత్సరాలుగా రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, జీడీపీ లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోన్నాయని పేర్కొన్నారు.

సువిశాల సముద్రతీరం..
ఏపీకి సువిశాల సముద్ర తీరం ఉందని, భారీ పోర్టులు ఉన్నాయని, కొత్తగా మరో నాలుగు ఓడరేవులు ఏర్పాటు కానున్నాయని, ఏ పారిశ్రామికవేత్తకయినా పెట్టుబడులు పెట్టడానికి ఇంతకంటే ఏం కావాలని సజ్జన్ జిందాల్ అన్నారు. గ్రామస్థాయిలో సేవలు, లబ్దిదారుల ఇంటి వద్దకే ప్రభుత్వ పాలనను అందించడం.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆకట్టుకుంటోందని వివరించారు.
బళ్లారి ప్లాంట్..
బళ్లారిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం తాను తొలిసారిగా 1995లో అక్కడికి వెళ్లానని, మొక్కలా మొదలైన ఆ ప్లాంట్ ఇవాళ ఒక మహావృక్షంలా ఎదిగిందని సజ్జన్ జిందాల్ అన్నారు. ప్రస్తుతం తోరణగల్లులోని స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 13 మిలియన్ టన్నులని వివరించారు. వచ్చే మూడేళ్లల్లో దాని ఉత్పాదక సామర్థ్యాన్ని 25 మిలియన్ టన్నులకు పెంచనున్నామని అన్నారు. అదే స్థాయిలో కడప స్టీల్ ప్లాంట్ ను రూపొందిస్తామని చెప్పారు.

స్టీల్ ప్లాంట్ కు మాత్రమే కాదు..
ఇవ్వాళ తాను భూమి పూజ చేస్తోంది కేవలం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మాత్రమే కాదని, జిల్లా అభివృద్ధికి శంకుస్థాపన చేస్తోన్నానని సజ్జన్ జిందాల్ చెప్పారు. కడప-బళ్లారికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని, ఈ రెండు ప్రాంతాల ప్రజలకు సామీప్యం ఉందని వివరించారు. ఈ స్టీల్ ప్లాంట్ను దేశంలోనే ఓ మోడల్ గా తీర్చిదిద్దాలనేది తన ఆకాంక్ష అని, ప్రపంచంలోనే ఈ ప్లాంట్ ను గ్రీనెస్ట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

విద్య, వైద్యంలో విప్లవాత్మక మార్పులు..
జగన్ సారథ్యంలో ఏపీలో విద్య, వైద్యంలో విప్లవాత్మక మార్పులను చూస్తోన్నానని సజ్జన్ జిందాల్ అన్నారు. ఈ రెండింటితో రాష్ట్రం రూపురేఖలు మార్చొచ్చని అన్నారు. విద్య, వైద్యంపై వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టడం గొప్ప విషయమని, అత్యున్నత సమాజాన్ని అది అందిస్తుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications