వచ్చే ఎన్నికలపై కేంద్ర మాజీ మంత్రి జోస్యం.. వైసీపీ, టీడీపీకి వచ్చే సీట్లు ఎన్నంటే?
ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అన్న కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వైసీపీ హయాంలో ప్రజలు సంతోషంగా లేరని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ వ్యాఖ్యానించారు. బటన్ నొక్కినంత మాత్రాన ముఖ్యమంత్రి జగన్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తిరుపతిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ దగ్గర నిరసన కార్యక్రమాన్ని ఈ కేంద్ర మాజీ మంత్రి చేపట్టారు.

పార్టీలో ఇమడలేక బయటకు వస్తున్నారు..
వైసీపీలో ఇమడలేక ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారని, తిరిగి ఆ పార్టీ అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీకి చెరో 25 సీట్లు వస్తాయన్నారు. రాజధానిపై ముఖ్యమంత్రి రోజుకోరకంగా మాట్లాడుతున్నారని, ప్రజలు ఆయన్ను విశ్వసించడంలేదని, జగన్ హయాంలో ప్రజలు సంతోషంగా లేరన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో తిరిగి అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.

అదానీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్
అదానీకి రూ.30వేల కోట్ల రుణాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజకీయ పలుకుబడితో కట్టబెట్టిందని, దేశంలో 24వేల బ్రాంచ్ లు ఉన్న ఎస్ బీఐ దివాలా తీస్తోందన్నారు. ఎస్ బీఐని అదానీ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చాలని సెటైర్ వేశారు. అదానీనీ వెంటనే అరెస్ట్ చేయాలని, ఎల్ఐసీని కూడా అదానీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గా మార్చాలన్నారు. ఇంటర్మీడియట్ చదివిన అదానీకి ఎటువంటి ష్యూరిటీలు లేకుండా 30వేల కోట్ల రుణం ఇచ్చారని, దీనిపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పతనమవుతున్న షేర్లు
అదానీ కంపెనీలకు సంబంధించి అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ నివేదికనివ్వడంతో ఆ కంపెనీలకు చెందిన షేర్లు రోజురోజుకు పతనమవుతున్నాయి. ఎస్ బీఐ, ఎల్ ఐసీ వరుసగా రూ.30వేల కోట్లు, 80వేల కోట్లు అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సుప్రీంకోర్టు జడ్జిచేత న్యాయవిచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి. అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వ ఒత్తిడి మేరకే ఎల్ ఐసీ, ఎస్ బీఐ అదానీ కంపెనీల్లోకి నిధులు మళ్లించాయని, అదంతా ప్రజల సొమ్మని, ఇప్పుడు నష్టపోయిన తర్వాత దానికి ఎవరు బాధ్యత వహిస్తారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.












Click it and Unblock the Notifications