వివేకా హత్య కేసులో నిందితుల పేర్లు వెల్లడించబోతున్న సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులెవరో ఐదారు రోజుల్లో సీబీఐ వెల్లడించబోతోందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ జిల్లా కాజీపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే నిందితులను సీబీఐ చెప్పబోతోందన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో మొదటి నుంచి చివరి వరకు అసలు ఏం జరిగిందనే విషయం ఎర్ర గంగిరెడ్డికి తెలుసన్నారు. సీబీఐ దగ్గర కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలున్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి వెంటే ఉంటూ దేవిరెడ్డి, ఎంపీ అవినాష్ ఏజంట్ గా మారి వివేకాను ఓడించే ప్రయత్నం కూడా చేశారని డీఎల్ ఆరోపించారు.
మైదుకూరులో అవినీతిని అంతం చేస్తానని ఎమ్మెల్యే చెప్పడంపై డీఎల్ సెటైర్లు వేశారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని, ముందుగా మైదుకూరు మున్సిపాలిటీలో ఉన్న అవినీతిని రూపుమాపాలన్నారు. మద్యం వ్యాపారంలో ఎవరికి ఎంత ముడుతుందో ప్రపంచంలో అందరికీ తెలుసన్నారు. ప్రధానమంత్రి మోడీ ఒకవైపు డిజిటల్ ఇండియా, డిజిటల్ మనీ అంటూ మొత్తుకుంటున్నారని, కానీ మద్యం షాపుల్లో మాత్రం క్యాష్ తీసుకుంటారన్నారు. ఎవరికి ఎంతివ్వాలనేది డిజిటల్ వల్ల సాధ్యం కాదని, అందుకే డైరెక్ట్ క్యాష్ పెట్టారన్నారు. శాసనసభ్యులు ఎర్రమట్టిని కూడా అమ్ముకుంటారనేది తాను ఊహించలేదని, తన జీవితంలోనే అలాంటిది చూడలేదన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ పూర్తి నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కోర్టుకు సమర్పించిన నివేదికల్లోను పూర్తి వివరాలను పేర్కొన్నట్లు తెలుస్తోంది. స్థానికులు కొందరు సీబీఐ అధికారులను బెదిరింపులకు గురిచేయడం, మార్గమధ్యంలో వాహనాన్ని అడ్డగించి బెదిరించడంలాంటివన్నీ పరిగణనలోకి తీసుకున్న సీబీఐ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా భావించి దర్యాప్తు చేస్తోంది.