కీలక మలుపు తిరిగిన వివేకానందరెడ్డి హత్య కేసు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎస్పీ రాంసింగ్ 2022లో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఓ పిటిషన్ దాఖలు చేశారు. తనను తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ రాంసింగ్ బెదిరించారని ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. ప్రాథమిక వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఫైనల్ విచారణను ఆగస్టు ఒకటోతేదీకి వాయిదా వేశారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్ తరఫున న్యాయవాది జూపూడి యజ్ఞదత్ వాదించారు.
క్రిమినల్ కేసుల్లో విచారణ ప్రత్యేకంగా ఉంటుంది
సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను బెదిరిస్తున్నారంటూ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేయగా దానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ రాంసింగ్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయాన్ని గజ్జల తరఫున వాదించిన న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ప్రస్తుత కేసులోను అవే ఉత్తర్వులు వర్తిస్తాయని, ఈ పిటిషన్ ను కొట్టేయాలని కోరారు. దీనిపై రాంసింగ్ న్యాయవాది జూపూడి యజ్ఞదత్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. క్రిమినల్ కేసులన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయని, సీబీఐ అధికారులకు ఢిల్లీ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం రక్షణ ఉందని గుర్తుచేశారు.

కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది
వీటిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని, ప్రస్తుత పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని తెలిపారు. పోలీసుల తరఫున కౌంటర్ దాఖలు చేయడంలేదంటూ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయమూర్తికి తెలిపారు. దీంతో విచారణ ఆగస్టు ఒకటోతేదీకి వాయిదా పడింది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో నిందితులుగా ఉన్నవారు చివరకు కేసు విచారణకు వచ్చిన సీబీఐ ఎస్పీపైనే ఫిర్యాదులు చేయడం, పోలీసులు కేసులు నమోదు చేయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications