ఇంత జనబలం ఉన్న జగన్ కు ఎందుకీ భయం : ఓడినా-గెలిచినా ఇలా : ఉండవల్లి సంచలనం..!!
ప్రధాని మోదీ రాజ్యసభలో ఏపీ విభజన గురించి చేసిన వ్యాఖ్యల పైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. స్వయంగా ప్రధాని రాజ్యసభ వేదికగా రాష్ట్ర విభజన తీరు జరిగిన తీరు పైన వాస్తవాలు చెప్పారని వివరించారు. ఏపీకి అన్యాయం జరిగిందని చెప్పిన ప్రధాని..ఎనిమిదేళ్లుగా ఏపీకి ఏం చేసారని ప్రశ్నించారు. ప్రధాని సభలో ఏపీకి అన్యాయం జరిగిందని... సభలో ప్రస్తావించిన సమయం లో ఏపీ ఎంపీలు ఏం చేసారని ప్రశ్నించారు. అసలు..ఏపీ గురించి పట్టించుకొనే పరిస్థితి కేంద్రంలో లేదన్నారు.
ఎందుకు కేంద్రమంటే భయం
ఏపీ అంటే అంత అలుసా అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. గతంలోనే అమిత్ షా.. ఇప్పుడు ప్రధాని ఏపీకి అన్యాయం జరిగిందని పదే పదే చెబుతున్నా... ఏపీ ఎంపీలు - పార్టీలు మాత్రం మాట్లాడకపోవటం ఏంటని ప్రశ్నించారు. ఏపీ ఎంపీలు సైతం ప్రశ్నిస్తారని ఒక సారి అనిపించుకోవాలని కోరారు. జగన్ కు ఏపీ ప్రజలు అడిగిన దాని కంటే ఎక్కువ సీట్లు.. ఓట్లు ఇచ్చారని చెప్పుకొచ్చారు. జగన్ ఒంటరిగా పోరాటం చేసి అధికారంలోకి వచ్చారని...ఇంత జనబలం ఉండి ఎందుకు కేంద్రానికి భయపడుతున్నారని ప్రశ్నించారు. ఏపీ ఎంపీలకు అంత భయమని నిలదీసారు. ప్రధాని మోదీ స్పందించినా..ఎంపీలు మాట్లాడకపోవటం ఏంటని అడిగారు. ఏపీలో అయితే, వైసీపీ లేదంటే టీడీపీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీజేపీకి అనుకూలంగానే ఉంటారని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
జగన్ -చంద్రబాబు ఇద్దూ మోదీకి అనుకూలమేగా
జగన్ - చంద్రబాబు వీరిద్దరూ ఒకరి దిగిపోయినా..మరొకరు సీఎం అవుతారని..వీరిద్దరినీ కాకుండా మరెవరైనా సీఎం కావాలంటే వీరిద్దరిలో ఒకరి మద్దతు తోనే సాధ్యమవుతుందని విశ్లేషించారు. సీఎం ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవటం వెనుక అనేక కారణాలు ఉంటాయని చెప్పారు. సాధారణ అంశాల పైన అధికారుల స్థాయిలోనే చర్చలు సాగుతాయని.. అందుకోసం ఆ భేటీలు జరగవని వివరించారు. ఏపీ ప్రయోజనాల కోసం జగన్ ముందుకు కదిలితే..అందరూ తప్పని పరిస్థితుల్లో అనుసరిస్తారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకొని చంద్రబాబు తప్పు చేశారని... జగన్ తిరిగి కేంద్రానికే అప్పగించి... ఈ బిల్లులు ఇవ్వని ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేసే విధంగా ఒత్తిడి చేయాలని సూచించారు.
కేసులు ఎప్పుడూ ఉంటాయి
ఇంత మెజార్టీ ఉండి..భయపడాల్సిన అసవరం జగన్ కు లేదని పదే పదే చెప్పుకొచ్చారు. జగన్ ఏ రకమైన వాటికి లొంగకుండా ప్రజల సమస్యలపైనే స్పందిస్తే...ప్రకాశం పంతులు తరహాలో కీర్తి ఉండేదని చెప్పారు. జగన్ గెలిచినా.. ఓడినా..తన నిర్ణయాలతో చరిత్రలో నిలిచిపోయేలా వ్యవహరిస్తారని భావించామని... కానీ, ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా అనేది కనిపించటం లేదని చెప్పారు. జగన్ ఎప్పుడు ఎలా ఉంటారో.. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయన పక్కన ఉన్న వారికే తెలియాలని వ్యాఖ్యానించారు. కేసులు గురించి అంటూ కొందరు విమర్శిస్తూ ఉంటారని.. కేసులు ఎప్పుడూ ఉంటాయని ఉండవల్లి పేర్కొన్నారు. చంద్రబాబు పైనా కేసులే అంటూ ప్రచారం చేసారని గుర్తు చేసారు.
జగన్ కీర్తి నిలవాలంటే...
ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులే రావటం లేదని చెప్పుకొచ్చారు. ఏపీలో ఉన్న పరిస్థితుల పైన మోదీకి ఇబ్బంది లేదన్నారు. జగన్ - చంద్రబాబు ఇద్దరి లో ఎవరు గెలిచినా...వారు మోదీకే మద్దతుగా ఉంటారని చెప్పారు. ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని బీజేపీ... బీజేపీ సహకారం లేకుండా ఎలా సాధ్యమని కాంగ్రెస్ వాదిస్తున్నాయని వివరించారు. ప్రధాని మోదీ పైన సీఎం కేసీఆర్ విమర్శలు చేయవచ్చు కానీ, పద ప్రయోగం బాగ లేదని వ్యాఖ్యానించారు. అన్యాయం చేసిన వారే ఏపీ గురించి పదే పదే మాట్లాడుతుంటే.. ఏపీ నేతలు మాత్రం ఎందుకు మాట్లాడరని ఉండవల్లి ప్రశ్నించారు. జగన్ వద్ద ఏదైనా మంత్ర దండం ఉంటే...ప్రజలకు ఆందోళన అవసరం లేదనే మాట చెప్పాలని... ఏం చేయబోతున్న దాని పైన క్లారిటీ ఉండాలని సూచించారు.