వెంకయ్యనాయుడి వ్యాఖ్యలతో డిఫెన్స్ లో పడిన బీజేపీ?
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి వ్యాఖ్యలతో ఏపీ బీజేపీ ఇరకాటంలో పడింది. ఇటీవలే ఒక కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని ప్రశంసించారు. ప్రజా ప్రతినిధులంతా ఈ తరహా కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఎన్నికలప్పుడు ఇంటికెళ్లే పద్దతి కాకుండా చేస్తున్న పనులపై స్పందన తెలుసుకునేందుకు, పథకాల గురించి ఆరా తీయడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. పథకాలు ఒకవేళ వారికి అందకపోతుంటే వెంటనే అందజేయడానికి చర్యలు తీసుకోవడానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతోందన్నారు. అందరూ దీన్ని అలవరుచుకోవాలని సూచించారు.

తలలు పట్టుకున్న పార్టీ నేతలు
వెంకయ్యనాయుడి వ్యాఖ్యలతో బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో యుద్ధానికి దిగిన సమయంలో కేంద్రం నుంచి ఎవరో ఒకరు రావడం.. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం.. ఇలా సర్వసాధారణమైపోయింది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు ప్రజాపోరు యాత్ర సాగిస్తోన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీతో స్థానిక బీజేపీ నేతలు లాలూచీ పడ్డారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అటువంటిదేమీ లేదని, తాము అందరికన్నా ఎక్కువగా వైసీపీని విమర్శిస్తున్నామని పోరు యాత్రలో నేతలు చెబుతున్నారు.

జగన్ పై నిప్పులు కురిపిస్తున్న నేతలు
ఏపీలో బీజేపీ సొంతంగా అధికారం చేపట్టడానికి ఇటీవలే కేంద్ర నాయకత్వం వీరికి ఒక ప్రణాళికను అప్పగించింది. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు పోరుబాట పట్టాల్సిన బాధ్యతను ఐవైఆర్ కృష్ణారావుకు అప్పగించింది. సత్యకుమార్, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ లాంటివారంతా జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు కురిపిస్తున్నారు. పార్టీ బలపడుతోంది.. ప్రజలు మనం చెప్పింది నమ్ముతున్నారు అనుకుంటున్న తరుణంలో వెంకయ్య చేసిన వ్యాఖ్యలతో వారి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లైంది.

జగన్ సర్కారుకు అనుకూలంగా..
తాము ఎంతో కష్టపడి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నామని, కానీ కేంద్రం నుంచి ఎవరో ఒకరు రావడం, జగన్ సర్కారుకు అనుకూలంగా మాట్లాడుతుండటంతో ఏం చేయాలో పాలుపోవడంలేదంటున్నారు. వైసీపీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రస్థాయిలో ఎండగడుతున్న నేతల ఆవేశంపై కేంద్ర మంత్రులు ఎల్.మురుగన్, గజేంద్రసింగ్ షెకావత్ లాంటివారు కూడా నాడు-నేడు, తాగునీటి వసతులు బాగున్నాయంటూ ఇచ్చిన ప్రశంసలు వారిని నీళ్లు గుమ్మరించినట్లవుతోంది. పోరుయాత్రలో భాగంగా బీజేపీ నేతలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేతలను ప్రజలు నిలదీసే సమయంలో ఎవరో ఒకరు వచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంవల్ల ఏపీలోని బీజేపీ శ్రేణులు గందరగోళంలో పడుతున్నాయి.












Click it and Unblock the Notifications