ఆశ్చర్యం.. రుషికొండపై పచ్చదనం!!
గతంలో ఉన్న రిసార్టును కూలగొట్టి రుషికొండను తవ్వేసి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు.
రుషికొండ మొత్తం పచ్చగా కనిపించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తవ్వేసిన చోట మొత్తం తవ్వినట్లుగా కనిపించకుండా గ్రీన్ కార్పెట్ను పరిచారు. గతంలో తవ్విన చోట.. తవ్వినట్లుగా స్పష్టంగా కనిపించేది. అయితే ఈ గ్రీన్ కార్పెట్ ను పరవడంవల్ల దూరం నుంచి చూసిన వారికి కొండ అంతా పచ్చగా కనిపిస్తోంది. దీనిపై అధికార వర్గాలు ఎటువంటి ప్రకటన చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
గతంలో ఉన్న రిసార్టును కూలగొట్టి రుషికొండను తవ్వేసి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. నిర్మాణాలు జరిగితే తప్పేంటి అని మంత్రి బొత్స కూడా గతంలోనే వ్యాఖ్యానించారు. అయితే కొండను తవ్వేయడం నిబంధనలకు విరుద్ధమే కాకుండా అనుమతించిన దాని కన్నా ఎక్కువ తవ్వేశారని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలమయ్యాయి. ఐదుగురు కేంద్ర పర్యావరణ శాఖ అధికారులతో కమిటీని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. సమగ్రంగా సర్వే నిర్వహించేందుకు ఐదుగురు సభ్యులుండాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు ఆదేశాలు ఇచ్చింది.
కొండను కొట్టేసిన ప్రాంతంలో తాజాగా అధికారులు చేస్తున్న పనులు మరోసారి రుషికొండపై దృష్టిసారించేలా చేస్తున్నాయి. జర్మనీ టెక్నాలజీతో తయారైన ఈ మ్యాట్లు రాళ్లు జారకుండా చేస్తాయని, కొన్ని రోజుల తర్వాత వీటిపై మొక్కలు నాటితే సులువుగా పెరుగుతాయని అధికారులు తెలిపారు. పచ్చటి కొండను బోడిగుండులా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రయత్నాలన్నీ వృథానే కదా అనే చర్చలు నడుస్తున్నాయి. త్వరలో విశాఖపట్నంలో అంతర్జాతీయ సదస్సులు జరగనుండటంతో అక్కడికొచ్చే ప్రతినిధులకు అంతా గ్రీనరీ కనపడాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.