భూమా నాగిరెడ్డిలో మరో కోణం: అప్పుడు అదో సంచలనం, విభజనపై..
భూమా నాగిరెడ్డి ఫ్యాషన్ నుంచి శాంతి వైపు నడిచారు. 2000లలో ఫ్యాక్షన్కు వ్యతిరేకంగా నిర్వహించిన శాంతియాత్రలు పెను సంచలనాన్ని సృష్టించించాయి.
ఆళ్లగడ్డ: భూమా నాగిరెడ్డి ఫ్యాషన్ నుంచి శాంతి వైపు నడిచారు. 2000లలో ఫ్యాక్షన్కు వ్యతిరేకంగా నిర్వహించిన శాంతియాత్రలు పెను సంచలనాన్ని సృష్టించించాయి. ఇరిగెల రాంపుల్లారెడ్డి, గంగుల వర్గీయులతో తమకున్న ఫ్యాక్షన్ కారణంగా ఎంతోమంది మరణించటం, అన్ని వర్గాల్లోనూ బాధితులు అంతకంతకూ పెరగటం భూమాను కదిలించిందని అంటారు.
ఫ్యాక్షన్కు చెక్ చెప్పేందుకు
ఫ్యాక్షన్ హింసకు చెక్ చెప్పేందుకు, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఆయన శాంతి యాత్రలు నిర్వహించారు. కోయిలకుంట్ల, ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆయన శాంతి పాదయాత్రలు జరిపారు. దీనిని ఉద్యమరూపంలో నిర్వహించారు.
శాంతియాత్రలో కౌన్సెలింగ్
తన శాంతి పాదయాత్రలో భాగంగా ఫ్యాక్షన్ గ్రామాల్లో ఇరువర్గాల్ని ఒకచోటకు చేర్చి, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మరీ రాజీ చేశారు. న పాదయాత్రతో పలు గ్రామాల్లోని వర్గాల మధ్య విభేదాల్ని ఒక కొలిక్కి తెచ్చిన వైనం అప్పట్లో అందరూ మాట్లాడుకునేలా చేసింది.
రాజకీయంగా తొలి ఓటమి
2004 అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన భూమా.. గంగుల ప్రతాప్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. రాజకీయంగా ఆయనకు అదే తొలి ఓటమి.
రాయల తెలంగాణ నినాదం
ఏపీ విభజనకు ముందు తెలంగాణ ఉద్యమానికి భూమా తనదైన శైలిలో పరిష్కారం సూచించారు. రాయల సీమను తెలంగాణను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలన్నారు. సీమ ప్రజల భావోద్వేగాలు తెలంగాణ ప్రజల మాదిరే ఉంటాయన్నది ఆయన వాదన. ప్రజారాజ్యం పార్టీలో చేరటానికి ముందు టిడిపిలో ఉన్న సమయంలో ఆయన ఈ నినాదాన్ని సూచించారు.