భద్రతాలోపం: విశాఖ సిఐఐ సదస్సులోకి నకిలీ ఐఎఎస్ ప్రవేశం
విశాఖపట్నం: దేశ, విదేశీ ప్రముఖులు పాల్గొంటున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో భద్రతాలోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదివారం పోలీసు యూనిఫాంలో ఓ ఆగంతకుడు ప్రవేశించగా, సోమవారంనాడు ఓ నకిలీ ఐఎఎస్ అధికారి ప్రవేశించాడు. తాను ఐఎఎస్ అధికారనంటూ ఆ ఆగంతకుడు సదస్సులోకి ప్రవేశించాడు.
అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రమేష్ నాయుడిగా గుర్తించారు. ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి కారులో వచ్చిన అతను ఆయన వెంటనే లోనికి ప్రవేశించినట్లు చెబుతున్నారు. తీరా అనుమానం వచ్చి ఐడి కార్డు అడగ్గా దాన్ని చూపించలేకపోయాడని సమాచారం. దాంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతనిపై చీటింగ్ కేసులు కూడా నమోదై ఉన్నట్లు గుర్తించారు.
ఆదివారంనాడు పోలీసు యూనిఫాంలో ఓ వ్యక్తి ప్రవేశించి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అతి సన్నిహితంగా సంచరించినట్లు చెబుతున్నారు. అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అనూహ్య స్పందన
ఇదిలావుండగా, సీఐఐ సదస్సుకు ఊహించిన దానికన్న ఎక్కువ స్పందన లభించిందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు రూ.5 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా ఉన్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది కూడా విశాఖలోనే సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
62 ఐటి కంపెనీలతో ఒప్పందాలు
62 ఐటి కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు. దానివల్ల 3 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు.