ఊహించని రీతిలో చంద్రబాబుకు షాక్ ఇచ్చిన అమరావతి రైతులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అగ్ర స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కసరత్తులు చేస్తున్నారు. అందుకు అనేకరకాలుగా సరికొత్త ప్రతిపాదనలు ప్రజలముందు పెడుతున్నారు. అలాగే అమరావతికి దేశంలోని అన్ని ముఖ్యనగరాలతో అనుసంధానం జరగాలంటే రైలుమార్గం ఉండాలని భావించి కొత్త రైల్వే లైను ప్రతిపాదనకు కేంద్రం నుంచి అనుమతిని సాధించారు. కొత్తగా 57 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రైల్వే లైను ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి ప్రారంభమై గుంటూరు జిల్లా నంబూరు వద్ద ముగుస్తుంది. ఈ మధ్యలో వచ్చే అమరావతి స్టేషన్ అతి పెద్ద రైల్వే స్టేషన్ గా, రాష్ట్ర రాజధాని స్టేషన్ గా నిలవబోతోంది.
భూసమీకరణ మార్గంలో తీసుకోవాలి
రైలుమార్గం కోసం అధికారులు భూసేకరణ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని చిలుకూరు, దాములూరు గ్రామాల్లో రెవెన్యూ అధికారులు, రైల్వే అధికారులు భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. అయితే వీరికి ఊహించనిరీతిలో వింతైన అనుభవం ఎదురైంది. ఆయా గ్రామాలకు చెందిన రైతులు తమ భూములను రైల్వే లైను కోసం ఇవ్వాలంటే అమరావతిలో చంద్రబాబు భూములను సమీకరించిన విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ పద్ధతిలో అయితే భూములను ఇస్తామని అధికారులకు స్పష్టం చేశారు. అమరావతిని కలుపుతూ ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు నిర్మించబోతున్న ఈ కొత్త రైల్వే మార్గం కోసం 75 ఎకరాల భూమి అవసరంకాగా దీన్ని రైతుల నుంచి సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను అధికారులు రైతులకు వెల్లడించగా వారు పైవిధంగా డిమాండ్ చేశారు.

రైల్వేలో ఉద్యోగాలివ్వాలి
దాములూరు, చిలుకూరు, కొత్తపేట ప్రాంతాలకు సెంటర్ గా ఉన్న చిలుకూరు శివారులో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయడంతోపాటు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని, గ్రామాల్లోకి రాకపోకలు సాగించేందుకు సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేయాలని కోరారు. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రైల్వేలో ఉద్యోగాలివ్వాలని కోరగా ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని అధికారులు రైతులకు చెప్పారు. ఈ కొత్త రైల్వే లైనులో భాగంగా వడ్డమాను దగ్గర కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల మేర అత్యంత పొడవైన వంతెనను నిర్మించబోతున్నారు. తాడికొండ, అమరావతి, కొప్పురావూరు, పరిటాల, కొత్తపేట, గొట్టిముక్కల, చెన్నారావుపాలెం, పెద్దాపురం రైల్వేస్టేషన్లు కొత్తగా వస్తాయి. ఈ లైను అందుబాటులోకి వస్తే విజయవాడ రైల్వేస్టేషన్ పై ఒత్తిడి తగ్గుతుంది. కొన్ని ప్రధాన రైళ్లను న్యూ గుంటూరు రైల్వేస్టేషన్ మీదుగా తెనాలి, ఒంగోలు మార్గంలో చెన్నైకి, తిరుపతికి అనుసంధానం చేస్తారు.












Click it and Unblock the Notifications