ప్లాట్లు ఏప్రిల్లో ఇస్తాం: రాజధానిపై నారాయణ, ఫుడ్ పార్క్.. పోలీసులపై రాళ్లు
గుంటూరు: రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఏప్రిల్ నాటికి ప్లాట్లు కేటాయిస్తామని మంత్రి నారాయణ శుక్రవారం నాడు చెప్పారు. రాజధాని మాస్టర్ ప్లాన్లో మార్పులకు అవకాశం ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
మార్పులు చేయడానికి ప్రజల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. రైతుల అభ్యంతరాలను ఫిబ్రవరి 1లోగా సిఆర్డీఏకు తెలియజేయాలని సూచించారు. గ్రీన్ బెల్టు పైన నిబంధనల ప్రకారమే తాము ముందుకు పోతామని చెప్పారు.
బిల్డింగ్ పీనలైజేషన్ స్కీంను (బీపీఎస్) నెల రోజుల పాటు పొడిగిస్తామని చెప్పారు. ప్రజలు దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామ శివారు వరకు ప్రధాన రహదారుల నిర్మాణం ఉంటుందని, గ్రామ కంఠాల పైన సిఆర్డీఏ అధికారులు గ్రామస్తులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు.
తుందుర్రులో ఉద్రిక్తత
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రు గ్రామంలో శుక్రవారం ఉద్రిక్తతతో చోటు చేసుకుంది. ప్రభుత్వం నిర్మిస్తున్న మెగా ఫుడ్పార్కుకి వ్యతిరేకంగా మూడు గ్రామాల ప్రజలు ఉదయం నుంచి ఆందోళన చేపడుతున్నారు.
ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల పరిసర గ్రామాల్లో పర్యావరణ దెబ్బతింటుందని ఆందోళన కారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవటంతో వారు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అయితే సాయంత్రం ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు గ్రామస్థులు మళ్లీ ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు గ్రామస్థులు గాయపడ్డారు. ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు, అధికారులు కొందరు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏలూరు నుంచి ప్రత్యేక బలగాలను రప్పించారు.