ప్రేమే నేరమా: కూతురితో పురుగుల మందు తాగించాడు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్నకూతురిని తండ్రి హత్య చేయడానికి ప్రయత్నించాడు. ప్రేమించిందనే కోపంతో కూతురితో బలవంతంగా పురుగుల మందు తాగించి చంపేసే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన శనివారం రాత్రి అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలో జరిగింది.
శింగనమల మండలం ఆకులేడు గ్రామానికి చెందిన నరసింహారెడ్డి కూతురు సి జ్యోతి అనంతపురంలోని హాస్టల్లో ఉంటూ ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆమె బుక్కరాయసముద్రం మండలం ఆర్ కొత్తూరు గ్రామానికి చెందిన సుదర్శన్రెడ్డితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని తండ్రి నరసింహారెడ్డి గమనించాడు.
దాంతో ఈ నెల 7వ తేదీన కూతుర్ని హాస్టల్ నుంచి తీసుకువచ్చి అనంతపురంలో ఉన్న వారి బంధువుల ఇంటిలో ఉంచాడు. శనివారం బంధువుల ఇంటి వద్ద నుంచి ఇంటికి వెళ్దామని చెప్పి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి బుక్కరాయసముద్రం మండలం బి కొత్తపల్లి గ్రామం సమీపంలోని కెనాల్ వద్ద ఆపాడు.
బైక్లో ఉంచిన పురుగుల మందును తీసి బలవంతంగా జ్యోతి నోటిలో పోశాడు. దాంతో ఆమె అపస్మారక స్థితిలో పడిపోగా మృతి చెందిందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే కొద్దిసేపటి తరువాత ఆమె స్పృహలోకి వచ్చి, సమీపంలో ఉన్న కళాశాల వద్దకు వెళ్లింది.
కళాశాల సిబ్బంది సమాచారం మేరకు 108 సిబ్బంది అక్కడికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు వైద్యులకు ఇచ్చిన సమాచారం మేరకు విషయం తెలియడంతో బుక్కరాయసముద్రం ఎస్ఐ విశ్వనాథ చౌదరి ఆసుపత్రికి వెళ్లి బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. అలాగే జ్యోతి ఫిర్యాదు మేరకు తండ్రి నరసింహారెడ్డిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు.