కృష్ణపట్నం విద్యుత్తు: బాబుపై నమస్తే తెలంగాణ ఫైర్

హైదరాబాద్: కృష్ణపట్నం విద్యుచ్ఛక్తి ప్రాజెక్టుకు సంబంధించిన కరెంట్ వాటా విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మళ్లీ చిచ్చు ప్రారంభమైంది. కృష్ణపట్నంపై ఆంధ్ర పచ్చి మోసం అంటూ గురువారంనాడు నమస్తే తెలంగాణ దినపత్రికలో ఓ వార్తాకథనం ప్రచురితమైంది. తెలంగాణకు కృష్ణపట్నం నుంచి రావాల్సిన వాటా అందడం లేదంటూ ఆ వార్తాకథనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుమ్మెత్తిపోసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడింది.

నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తాకథనం ఇలా సాగింది - ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మించిన కృష్ణపట్నం, హిందుజా పవర్‌ప్రాజెక్టుల్లో తెలంగాణకు 53.89 శాతం వాటా ప్రకారం విద్యుత్ అందాల్సి ఉంది. అయితే.. ఆ ఊసే లేదన్నట్లు ఏపీ డిస్కమ్‌లు వ్యవహరిస్తున్నాయని తెలంగాణ విద్యుత్‌రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మంగళవారం ఏపీ డిస్కమ్‌లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పించిన వార్షిక ఆదాయ వనరుల(ఏఆర్‌ఆర్) నివేదికల్లో ఆ రెండు ప్రాజెక్టుల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ మొత్తం ఆంధ్రప్రదేశ్‌కేనని పేర్కొనడాన్ని వారు తప్పుపడుతున్నారు.

Fight between AP and Telangana on Krishnapatnam

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో 1,600 మెగావాట్ల దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం), విశాఖపట్నం సమీపంలో 1,040 మెగావాట్ల హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఎన్‌పీసీఎల్)లలో తెలంగాణలోని రెండు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల భాగస్వామ్యం ఉంది. కానీ.. ఈ విషయాన్ని ఏపీ సర్కారు ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నదని తెలంగాణ నిపుణులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర విభజన తదుపరి తెలంగాణ రాష్ట్రం గణనీయమైన విద్యుత్ లోటును ఎదుర్కొంటున్నదన్న విషయం తెలిసికూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్‌రంగంలో కుట్రలకు ఆజ్యం పోశారని వారు గుర్తుచేస్తున్నారు.

గత ఏడునెలలుగా తెలంగాణకు విద్యుత్ వాటాను ఇవ్వకుండా అడ్డుకుంటూ, వివాదాలకు చంద్రబాబు ప్రభుత్వం కారణమైందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మించిన కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి అంతా తమదేనని ఏఆర్‌ఆర్‌లలో పేర్కొనడంతో దాని కుట్రలు తారాస్థాయికి చేరినట్లయిందని అభివర్ణిస్తున్నారు.

హిందుజా యాజమాన్యం తమ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణకు వాటా ఇచ్చేందుకు ముందుకు వస్తున్నా ఏపీ సర్కారు ఆ కంపెనీపై రాజకీయపరమైన ఒత్తిళ్ళు తీసుకువస్తుందనే ఆరోపణలకు ఏఆర్‌ఆర్ నివేదికలే నిదర్శనమని తెలంగాణ విద్యుత్ నిపుణులు విమర్శిస్తున్నారు.

డిస్కంలు ఏం చెప్పాయి..

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలికి ఏపీ డిస్కంలు అందజేసిన నివేదికలో పలు కీలక అంశాలను పొందుపరిచారు. కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌తో పాటు, విశాఖలోని హిందుజా విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌ అంతా ఏపీకి చెందుతుందని ఈ నివేదికలో ఏపీ డిస్కంలు స్పష్టం చేశాయి. ఈ రెండు విద్యుత్‌ కేంద్రాల ద్వారా ఏటా 15 వేల 581 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని, జీవో 20 ప్రకారం తెలంగాణకు 46.11 శాతం విద్యుత్‌ ఇస్తామని నివేదికలో పేర్కొన్నారు.

అంతేకాకుండా విద్యుత్‌ కేంద్రాలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రాలకే చెందుతాయని ఏపీ డిస్కంలు తేల్చిచెప్పాయి. ఏపీఈఆర్‌సీ దృష్టికి ఈ విషయాలు తీసుకురావడం ద్వారా తమ వాదనకు చట్టబద్దమైన ఆమోదం పొందేందుకు ఏపీ డిస్కంలు సిద్ధమయ్యాయని విద్యుత్‌ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుని కృష్ణా రివర్‌ బోర్డుకు అప్పగించాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని, దీని వల్ల ఏపీ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతోందని లేఖలో వాదించింది. ప్రాజెక్టులు, రిజార్వాయర్ల నిర్వహణను రివర్‌ బోర్డు చేపట్టాలని విభజన చట్టంలో పేర్కొన్నట్లు చెప్పారు.

కాగా, ఇరు రాష్టాల మధ్య సమస్యల పరిష్కారం కోసం మధ్యవర్తిగా వ్యవహరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. గిల్లికజ్జాలతో ఇరు రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతోందని, సమస్యలపై బేషజాలకు పోకుండా చర్చకు తాము సిద్ధమని సీఎం చంద్రబాబు గవర్నర్‌తో చెప్పినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+