వైసీపీకి ప్రచారం చేసే గ్రామ వాలంటీర్లను తన్ని తరమండి : బుద్దా వెంకన్న
టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో వైసీపీ సర్కార్ పై, సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో టీడీపీ నేత బుద్దా వెంకన్నఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులతో చర్చించారు .విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న పిలుపునిచ్చారు.
స్థానిక పోరుపై భేటీ అయిన బీజేపీ, జనసేనలు .. 12 న ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల
స్థానిక ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టాలని టీడీపీ పిలుపు
గవర్నర్ పేట లోని కేశినేని భవన్ లో బుద్ధా వెంకన్న అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్,ఎమ్మెల్సీ అశోక్ బాబు, లింగమనేని శివప్రసాద్, బోండా ఉమా తదితరులు హాజరయ్యారు. అభ్యర్థులను డివిజన్ కమిటీ నాయకులే ఏకగ్రీవంగా ఎంపిక చేసుకోవాలని ఈ సమావేశంలో సూచించారు. ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు చెక్ పెట్టేలా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
గ్రామ వాలంటీర్లకు దేహశుద్ధి చేయాలన్న బుద్దా వెంకన్న
వైసీపీ తరపున ప్రచారం చేసే గ్రామ వాలంటీర్లకు దేహశుద్ధి చేయాలని చెప్పారు. ఎవరైనా గ్రామ వాలంటీర్లు వైసీపీకి అనుకూల ప్రచారం చేస్తే తన్ని తరమాలని పిలుపునిచ్చారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు . మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ, టీడీపీని ఎదుర్కోలేకే ముఖ్యమంత్రి జగన్ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Recommended Video
స్థానిక ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్పాలన్న టీడీపీ
వైసీపీకి టీడీపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు టీడీపీ శ్రేణులంతా కలసికట్టుగా పని చేయాలని చెప్పారు. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పట్టణాలు, పల్లెల్లో మంచి వాతావరణం లేదని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని,కాబట్టి ప్రజా క్షేత్రంలో ఎన్నికల సమయంలో అయినా వైసీపీ అసమర్థ పాలనను ఎండగట్టాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు.