‘బయటికి రారా చూసుకుందాం’: అసెంబ్లీలో టీడీపీ-వైసీపీ సభ్యుల వీరంగం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు, అధికార పక్ష సభ్యుల పరస్పర నిరసనలతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓటుకు నోటు కేసు తీర్మానంపై చర్చించాలంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు, అధికార పక్ష సభ్యుల పరస్పర నిరసనలతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓటుకు నోటు కేసు తీర్మానంపై చర్చించాలంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టిబట్టి స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగి నినాదాలు చేశారు.
అధికార పక్షం సభ్యులు కూడా వారికి కౌంటర్గా నినాదాలు చేశారు. ఓ దశలో కొట్టుకునేంత పని చేశారు అధికార, విపక్ష సభ్యులు. 'బయటికి రారా తేల్చుకుందాం' అంటూ వైయస్సార్ కాంగ్రెస్ సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అధికార పక్షం సభ్యుడు చింతమనేని ప్రభాకర్లు సవాళ్లు విసురుకున్నారు.
చింతమనేనికి మద్దతుగా మరో ఇద్దరు సభ్యులు వంశీ, ప్రభాకర్ చౌదరి రాగా, చెవిరెడ్డికి మద్దతుగా శివప్రసాద్ రెడ్డి వచ్చారు. అర్థం లేని గొడవ చేస్తున్నారంటూ చింతమనేని ఈ సందర్భంగా అన్నారు. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్నారు.
అగ్రిగోల్డ్ భూములను మంత్రి పుల్లారావు కుటుంబం కొనుగోలు చేసిందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఓటుకు నోటు కేసు రాష్ట్రం పరువుకు సంబంధించినది అన్నారు. కాగా, రూ. కోట్ల అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లారంటూ వైయస్ జగన్పై అధికార పక్షం సభ్యులు ధ్వజమెత్తారు. ఇరుపక్షాల ఆందోళనలతో సభ వాయిదా పడుతూ వస్తోంది.