ఏపీలో తొలి ఫలితం తేలేది అక్కడే : సీఎం సొంత జిల్లాలో ముందుగా ఫలితాలు: చివరగా కర్నూలు ...!
టెన్షన్ మొదలైంది. ఏపీ ఎన్నికల్లో అసలైన కీలక ఘట్టం ఆరంభమైంది. మరి కొద్ది సేపట్లో ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు..25 లోక్సభ నియోజకవర్గాల విజేతలెవరో తేలిపోనుంది. ఏపిలో అయితే తొలుత పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంతో పాటుగా చిత్తూరు జిల్లా మదనపల్లి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక..ఆసక్తికర పోరు సాగిన కీలక నియోజకవర్గాల్లో ఫలితం సాయంత్రానికి అధికారికంగా ప్రకటించనున్నారు.

తొలుత నరసాపురం..మదనపల్లి
ఎన్నికల ఫలితాల్లో ఏపీలో తొలి అధికారిక ఫలితం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తో పాటుగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లి కానున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. మదనపల్లి నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొని ఉంది. జనసేన అభ్యర్ది ఇక్కడ బాగా ప్రభావం చూపించారని నియోజకవర్గం లో అన్ని పార్టీలు అంచనా వేస్తున్నాయి. దీంతో..ఇక్కడ ఎవరు గెలుస్తారనేది ఆసక్తి కరంగా మారింది. అదే విధంగా మదనపల్లి నుండి టీడీపీ..వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా తల పడ్డాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావటంతో ఇక్కడి నుండి వెలువడే తొలి ఫలితం ఆ జిల్లాలో వచ్చే ఫలితాలకు దిక్సూచిగా ఉండే ఛాన్స్ ఉంది. మధ్నాహ్నం 12 నుండి 1 లోగా ఈ రెండు ఫలితాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.

చిత్తూరు జిల్లాలో ఫలితాలే ముందుగా..
మొత్తం 13 జిల్లాల్లో ఈ రోజు తొలుత చిత్తూరు జిల్లా ఫలితాలు ముందుగా వెల్లడయ్యే అవకాశం ఉంది. జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు..రెండు లోక్సభ ఎన్నికల ఫలితాల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.
ఈసారి ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తి చేసేందుకు కౌంటింగ్ హాళ్లను బట్టి టేబుళ్ల సంఖ్యను పెంచుకోవడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. చిత్తూరు జిల్లాలో కొన్నిచోట్ల 16 నుంచి 20 వరకు టేబుళ్లను ఏర్పాటు చేశారు. దీంతో అన్నిటి కంటే ముందుగా చిత్తూరు జిల్లా ఫలితాలు వెలువడే అవకాశముంది. మదనపల్లి, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 టేబుళ్లను సిద్ధం చేయడంతో ఫలితాలు వేగంగా వెలువడనున్నాయి.

కర్నూలు..రాజమండ్రి ఆలస్యంగా..
ఇక, ఎన్నికల ఫలితాల్లో చివరగా కర్నూలు..రాజమండ్రి రూరల్ నియోకవర్గాల్లో వెల్లడి కానున్నాయి. కర్నూలు నియోజకవర్గంలో అత్యధికంగా 33 రౌండ్లు పూర్తి చేయాల్సి ఉన్నందున ఫలితం చివరన వెలువడే అవకాశముంది. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 30 రౌండ్లకుపైగా పట్టే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా జిల్లా నందిగామలో అత్యల్పంగా 7 టేబుళ్లను ఏర్పాటు చేశారు. చాలా నియోజకవర్గాల్లో 18 నుంచి 24 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. ఇక, ఉదయం 10 గంటలకు ట్రెండ్ తెలిసి పోయే అవకాశం ఉంది. దీంతో..ఇప్పుడు పొటీలో ఉన్న అభ్యర్దులే కాదు...మొత్తం రాష్ట్ర ప్రజానీకం ఉత్కంఠగా ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications