జడ్పీ చైర్మన్ సోదరుడి అరెస్టు: తాగిన మత్తులో కార్మికుడిపై నుంచి కారు నడిపారు
కర్నూలు: కర్నూలు జిల్లాలోని పంచలింగాల చెక్పోస్టు పరిధిలోని పంజాబీ దాబాకు చెందిన కరణ్ గౌతమ్ హత్య హత్యకేసులో ఐదుగురు నిందితులను కర్నూలు గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 1న తెల్లవారు జామున కరణ్ గౌతమ్ను కొట్టి కారుతో ఢీకొట్టి హత్య చేశారు.
స్థానిక అరోరా నగర్కు చెందిన వాహన డ్రైవర్ దేవనూరు చందనకుమార్ అలియాస్ చందు, ఓర్వకల్లు మండలం హుస్సేనాపురం చెందిన గుడిసెల రాందాసు అలియాస్ దాసు, మల్లెల వెంకటరమణ, పల్లె మధు, పాలకొల్లు సుధాకర్రెడ్డి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
వీరిలో మల్లెల వెంకటరమణ జిల్లాపరిషత్ ఛైర్మన్ మల్లెల రాజశేఖర్కు స్వయంగా సోదరుడు. కేసును తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న పోలీసులు నిందితులను సోమవారం అరెస్టు చేశారు. డీఎస్పీ రమణమూర్తి, కర్నూలు గ్రామీణ సీఐ మధుసూదన్రావు, ఎస్సై కృష్ణమూర్తి నిందితుల అరెస్టు చూపారు. నంద్యాలలో తలదాచుకుని కర్నూలుకు వస్తుండగా అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండుకు పంపారు.
కాగా, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి వల్లే తమ కుటుంబం నడుస్తుందని, తమకు దిక్కెవరంటూ ఏడుస్తున్నారు. కాగా పోలీసులు వారికి నష్టపరిహారం ఇప్పించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.