టాపర్లకు, మీ కుమారుడు లోకేష్ కు కలిపి పరీక్షలు పెడదామా?: చంద్రబాబుకు డిప్యూటీ సీఎంల సవాల్
అమరావతి: గ్రామ సచివాలయం పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఆరోపిస్తోన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్ పై రాష్ట్ర ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. గ్రామ సచివాలయ పరీక్షల నిర్వహణ మొత్తం ఓ భారీ కుంభకోణమంటూ ఇష్టానుసారంగా వారిద్దరూ ఆరోపణలు చేస్తూ చంద్రబాబు రాసిన బహిరంగ లేఖకు కౌంటర్ ఇస్తూ వెనుక కడుపు మంట ఒక్కటే కారణమంటూ అయిదుమంది ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, పుష్ప శ్రీవాణి, నారాయణ స్వామి, అంజాద్ భాషా విమర్శించారు. దీనిపై వారు చంద్రబాబుకు ఓ బహిరంగ లేఖను రాశారు. పలు విషయాలను వారు ఇందులో ప్రస్తావించారు.
బహిరంగ లేఖా, లేక బరితెగింపు లేఖా?
చంద్రబాబు రాసింది బహిరంగ లేఖ కాదని, బరి తెగింపు లేఖ అని ఉప ముఖ్యమంత్రులు వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రలోనే ఏనాడూ కనీవినీ ఎరుగని విధంగా 1.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కూడా కాకముందే భర్తీ చేస్తున్న ప్రభుత్వాన్ని చూసి చంద్రబాబు అక్కసుకు గురవుతున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలను చంద్రబాబు తన అయిదేళ్ళ పాలనలో ఎందుకు భర్తీ చేయలేదని నిలదీశారు. గ్రామ సచివాలయాల ఆలోచన కూడా ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో అక్కడి యువతకు ఉద్యోగాలు వస్తుంటే ఇక చంద్రబాబు, ఆయన పార్టీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని దాన్ని భరించలేకే అభాండాలు వేస్తున్నారని అన్నారు. గ్రామ సచివాలయం పరీక్షలను కూడా పచ్చకామెర్ల కళ్లతో చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
కుంభకోణాలు ఎవరి హయాంలో..
స్టాంప్ పేపర్ల కుంభకోణం, దొంగనోట్ల కుంభకోణం, యూరో లాటరీ కుంభకోణం,,ఇలా మొదలు పెడితే ఇంటర్మీడియట్, ఎంసెట్ | ప్రశ్నపత్రాల లీకేజి వరకు... చంద్రబాబు చరిత్ర విప్పితే తవ్వని కొద్దీ బయటపడుతూనే ఉంటాయని అన్నారు. అయిదేళ్ల పరిపాలనలో ఫలానా కుంభకోణం జరగలేదని చెప్పగలరా అని సవాల్ విసిరారు. గ్రామ వాలంటీర్ణ వ్యవస్థ జన్మభూమి కమిటీల్లాంటి దోపిడీ భూమి వ్యవస్థ లాంటిది కాదని అన్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని చదివించిన సగటు కుటుంబాల వారంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కుటుంబాల్లో ఈ ఉద్యోగాలు వెలుగులను నింపుతాయని, గ్రామ సచివాలయ పరీక్షల్లో అలాంటి కుటుంబాలకు చెందిన అభ్యర్థులే టాపర్లుగా ఉన్నారని అన్నారు.
టాపర్లకు, లోకేష్ కు పరీక్షలు పెడదామా?
గ్రామ సచివాలయ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన వారికి, చంద్రబాబు కుమారుడు లోకేష్ కు కలిపి ఎగ్జామ్ పెడదామని, దీనికి సిద్దమేనా? అని సవాల్ విసిరారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారంతా నారా లోకేష్ మాదిరిగా అత్తెసరు చదువును చదువుకున్న అభ్యర్థులు కాదని, విదేశీ విద్య కోసం లక్షలాది రూపాయలు వేరే వారితో డొనేషన్లుగా కట్టించినా ప్రయోజనం లేని చదువును చదువుకున్న వారు కాదని ఎద్దేవా చేశారు. యువతకు వారి స్వగ్రామాల్లో, స్వస్థలాల్లోనే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుండగా.. చంద్రబాబు దాన్ని స్వాగతిస్తారని ఎవరూ అనుకోరని చెప్పారు. ఏపీపీఎస్సీని అత్యున్నత స్థాయిలో భ్రష్టు పట్టించిన చంద్రబాబు.. దాని నిర్వహణ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు.
అమ్మ ఒడి, రైతు భరోసా అమలైతే..
తమ నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో 1.25 లక్షల మందికి ప్రభుత్వోద్యోగాలు ఇస్తోందంటేనే ఇంతగా బెంబేలెత్తుతున్న చంద్రబాబు ఇక అమ్మ ఒడి, రైతు భరోసా సహా నవరత్నాలన్నీ ఆమలు కావటం ప్రారంభం అయిన తరవాత ఇంకెంతగా గంగవెర్రులెత్తుతారో ఊహించవచ్చని ఉప ముఖ్యమంత్రులు అన్నారు. ప్రజా జీవితంలో నాయకుడికి కావాల్సింది పనికిమాలిన అనుభవం కాదని, ప్రజల మీద అభిమానం కావాలని చెప్పారు. ఈ విషయాన్ని చంద్రబాబు ఇకనైనా గుర్తిస్తారన్న నమ్మకం తమకు లేదని అన్నారు. చంద్రబాబు వయసుకు తాము గౌరవం ఇస్తున్నామని, నాలుగు నెలలు కూడా నిండని కొత్త ప్రభుత్వం మీద ఏడుపును కొద్ది కాలం ఆపాలని తాము విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.