సీఎం హడావిడి నిర్ణయంతో సంక్షోభంలో ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ.!జగన్ కు నారా లోకేష్ మరో లేఖాస్త్రం.!
అమరావతి/హైదరాబాద్ : కరోనా సంక్షోభంతో తీవ్రనష్టాన్ని చవిచూసిన ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హడావిడి నిర్ణయం మూలిగే నక్క పై తాటికాయ పడిన చందంగా ఉందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి. నారా లోకేష్ మండిపడ్డారు. ముందస్తు ప్రణాళిక లేకుండా, సంబంధిత శాఖ అధికారులతో కనీసం ఒక సమావేశం కూడా ఏర్పాటు చెయ్యకుండా విశాఖ వేదికగా జరిగిన సభలో మీరు ప్లాస్టిక్ ఫ్లెక్స్ పరిశ్రమను బ్యాన్ చేస్తున్నాం అని ప్రకటించడంతో, ఈ రంగం పై ఆధారపడిన సుమారు 7 లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసారు నారా లోకేష్.
సీఎం జగన్ మరో తొందరపాటు నిర్ణయం..
రాష్ట్రంలో ఎన్ని యూనిట్లు ఉన్నాయి.?ఎంత మంది ఈ రంగం పై ఆధారపడి ఉన్నారు..?నిషేధం విధిస్తే తలెత్తే పరిణామాలు ఏంటి.?పరిశ్రమ పై ఆధారపడిన వారికి కలిగే నష్టం ఎంత మేర ఉంటుంది.? అని ఆలోచించకుండా, ముందస్తు సమాచారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ప్రభుత్వం ఎటువంటి కసరత్తు చెయ్యకుండా ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ మీద తొందరపాటు నిర్ణయం ఎలా తీసుకుంటారని నారా లోకేష్ వైయస్ జగన్ మోహన్ రెడ్డిని లేఖలో ప్రశ్నించారు. సంబంధిత పరిశ్రమపై ఆధారపడిన వారితో ఎటువంటి చర్చలు జరపకుండానే జి.ఓ. నెం: 65 తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ రద్దు చేయడం దారుణం..
కఠిన ఆంక్షలు, ఫైన్లు విధిస్తూ నవంబర్ ఒకటో తారీఖునుండే నిషేధాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ రంగాన్ని నమ్ముకున్న లక్షలాది మంది రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు లోకేష్. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జీవనోపాధి కోల్పోతున్నాం అంటూ ఆవేదనతో ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ పై ఆధారపడిన వారు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్లను, మంత్రులను, శాసనసభ్యులను కలిసి సమస్యను వివరించినా ఎటువంటి ఫలితం లేదని, ముఖ్యమంత్రిని కలిసి తమ బాధను చెప్పుకుందాం అనుకుంటే కనీసం అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉందంటూ వారి ఆవేదనను తనను కలిసిన సందర్భంలో వ్యక్తం చేసారని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేసారు.
పర్యావరణంపై అంత ప్రేమ పుట్టుకొచ్చిందా.?
అంతే కాకుండా పర్యావరణంపై సీఎం ఉన్నట్టుండి ప్రేమ ఒలకబోయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు లోకేష్. ఒక పక్క సీఎం ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలను ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీసున్నారని, విశాఖలో పచ్చని రుషి కొండని బోడి కొండగా వైసిపి నేతలు మార్చేసారని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేసారు. ఫ్లెక్సీ పరిశ్రమపై నిషేధం విధించేందుకు చూపించిన వేగం వైసిపి కనుసన్నల్లో నడుస్తున్న ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాని అరికట్టడంలో చూపిస్తే పర్యావరణానికి మేలు చేసినట్టు అవుతుందని సీఎం కు రాసిన లేఖలో నారా లోకేష్ పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి..
ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1500 ఫ్లెక్సీ ప్రింటింగ్ యూనిట్లు ఉన్నాయని, వీరంతా సుమారుగా 10 నుండి 30 లక్షల రూపాయిలు పెట్టుబడి పెట్టారని, బ్యాంకుల నుండి లోన్లు తీసుకుని కొంతమంది, అప్పులు చేసి కొంతమంది ఈ యూనిట్లను నెలకొల్పారను లోకేష్ గుర్తు చేసారు. నెలవారీ ఈఎంఐలు కట్టడమే కష్టం అవుతున్న సమయంలో మీరు తీసుకున్న నిర్ణయం వీరిని కోలుకోలేని దెబ్బతీసిందన్నారు లోకేష్. ప్రస్తుతం ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ ఎదుర్కుంటున్న తీవ్ర సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వం వారి సమస్యలు అధ్యయనం చేసేందుకు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సూచించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో కమిటీ ఏర్పాటు చెయ్యాలని నారా లోకేష్ డిమాండ్ చేసారు.