TTD: 12గం పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత- అన్న ప్రసాదాలకు బ్రేక్..!!
Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3.30 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున ,అంటే సెప్టెంబర్ 8వ తారీఖు 3 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సుమారు 12గం పాటు మూసివేయనున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో శ్రీవారి అన్నప్రసాదాల వితరణ కేంద్రాలు మూసివేయనున్నారు. 7వ తేదీన ఆర్జిత సేవలను రద్దు చేసారు.
చంద్రగ్రహణం కారణంగా టీటీడీ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సెప్టంబర్ 8న సోమవారం వేకువజామున 1.31 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా టీటీడీ వెల్లడించింది. సెప్టంబర్ 8న ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం భక్తులకు పునః ప్రారంభవుతుంది.

చంద్రగ్రహణం కారణంగా సెప్టంబర్ 7వ తేదీ ఆదివారం ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. చంద్రగ్రహణం కారణంగా సెప్టంబర్ 7న ఆదివారం సాయంత్రం 3 గంటల నుండి తిరుమలలో అన్నప్రసాదాల వితరణ వుండదు. తిరిగి సెప్టంబర్ 8వ తేది ఉదయం 8.30 గంటలకు అన్నప్రసాదాల పంపీణి పున: ప్రారంభం అవుతుందని టీటీడీ వెల్లడించింది. ఈ సందర్భంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, ఎస్వీ ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, పీఏసీ-2 లలో అన్నప్రసాదాల వితరణ ఉండదని స్పష్టం చేసింది. కాగా, భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా టీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో 30 వేల పులిహోర ప్యాకెట్లను సెప్టెంబర్ 7 సాయంత్రం 4.30 గంటల నుండి పంపీణి చేయనున్నారు.
ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపం, రామ్ భగీచా, పీఏసీ-1, సీఆర్వో, ఏఎన్సీ ప్రాంతాల్లోని ఫుడ్ కౌంటర్లు, శ్రీవారి సేవా సదన్ వద్ద భక్తులకు అన్నప్రసాదం ప్యాకెట్లను అందిస్తారు ఈ మేరకు భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. గ్రహణం అనంతరం శ్రీవారి సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications