లోకేష్ యాత్రలో ఆ ప్రకటన-మ్యాజిక్ ఫిగర్ సీట్లలో పవన్ పోటీ-మాజీ మంత్రి అనిల్ డిమాండ్స్..
ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా 175 సీట్లలో పోటీ చేయాలంటూ సీఎం జగన్ తాజాగా విసిరిన డిమాండ్ రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
నెల్లూరు : ఏపీలో వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు పోటీ నినాదం బాగానే వినిపిస్తోంది. సీఎం జగన్ తాజాగా తెనాలి సభలో విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన విడివిడిగా 175 సీట్లకు పోటీ చేయాలంటూ సీఎం జగన్ చేసిన డిమాండ్ పై విపక్షాలు దీటుగానే స్పందిస్తున్నాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలో సీఎం జగన్ చెప్పాలా అని ప్రశ్నిస్తున్నాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం జగన్ సవాల్ స్వీకరించాలని విపక్షాలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ వైసీపీ మాజీ మంత్రి అనిల్ యాదవ్ కూడా దీనిపై స్పందించారు.
నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో వైసీపీ సర్కార్ పనితీరును ముందుగా ప్రస్తావించారు. సీఎం జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. ఉద్యోగాల్లో తమ హయాంలో వచ్చిన అవకాశాలు గతం కంటే ఎక్కువన్నారు. ఒటర్లు ఉపాధ్యాయుల, పట్టభద్రుల అభ్యర్థులు ఘన విజయం ఖాయమన్నారు. పార్టీ నేతల్ని ధైర్యంగా ప్రజల్లోకి పంపే ఒకే ఒక్క సీఎం జగన్ అన్నారు. మరోవైపు పవన్, లోకేష్ పైనా విమర్శలు ఎక్కుపెట్టారు.

ఈ సందర్భంగా టీడీపీ యువ నేత లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అనిల్ కుమార్ సవాల్ విసిరారు. 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే ధైర్యం ఉందా అని పవన్, లోకేష్ లను ప్రశ్నించారు. యాత్రలో ఈ విషయాన్ని లోకేష్ ప్రకటించగలరా అని అడిగారు. లోకేష్ పాదయాత్ర పూర్తయ్యలోపు టీడీపీ తడిగుడ్డ వేసుకొని ఇంట్లో ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ కనీసం మ్యాజిక్ ఫిగర్ స్థానాల్లో అయినా పోటీ చేస్తారా అని ప్రశ్నించారు. సింగిల్ గా పోటీ చేసే సత్తా లేని వీళ్లా జగన్ గురించి మాట్లాడేది అన్నారు. తమకు పొత్తులు అవసరం లేదని, అప్పుడూ ఇప్పుడూ తాము సింగిల్ గానే పోటీ చేస్తామన్నారు. టీడీపీ, జనసేన కు ఆ సత్తా ఉందా అని అనిల్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications