Gummanuru Jayaram: గుంతకల్లులో గుమ్మనూరుకు షాక్..వెంకట్రామిరెడ్డికి కలిసొచ్చేనా..?
Gummanuru Jayaram: గుమ్మనూరు జయరాం.. మాజీ మంత్రి. వైసీపీ టికెట్ పై కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. ఆ తర్వాత జగన్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2024 ఎన్నికలకు వైసీపీ ఆయా నియోజకవర్గాల వారీగా మార్పులు చేర్పులు చేపడుతోంది.
ఇందులో భాగంగా గుమ్మనూరు జయరాంను ఎంపీగా పోటీచేయాల్సిందిగా ఆదేశించడంతో.. జయరాం ఆ ఆఫర్ను తిరస్కరించారు. ఇక చేసేదేమి లేక గుమ్మనూరు జయరాం మంగళవారం మంగళగిరిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా ధరించారు. ఇంతవరకు బాగానే ఉన్నా... ప్రస్తుతం గుమ్మనూరు జయరాంను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రఫ్ఫాడిస్తున్నారు.

జయరాంకు లోకేష్ వార్నింగ్: గుమ్మనూరు జయరాం అవినీతిపరుడంటూ,బెంజ్ మంత్రి అని, తన అరాచకాలను రెడ్ బుక్లో రాసుకున్నానని, అధికారంలోకి వస్తే గుమ్మనూరు భరతం పడతామని ఇటు లోకేష్ అటు చంద్రబాబు ఇద్దరూ వార్నింగ్లు ఇచ్చారు. ఆ సమయంలో గుమ్మనూరు జయరాం కూడా తిరిగి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఈ అంశాన్నే వైసీపీ నేతలు ఆయుధంగా మలుచుకుని గుమ్మనూరు జయరాంను టార్గెట్ చేశారు. ఇప్పుడు రెడ్ బుక్లో గుమ్మనూరు పేజీని తొలగిస్తారా.. లేక టీడీపీ తీర్థం పుచ్చుకోగానే పునీతుడయ్యాడా అంటూ ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శతృవులు ఉండరు.. కనిపించరు.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాకు విపరీతమైన క్రేజ్ రావడంతో ప్రతి ఒక్కరూ తమ అసంతృప్తిని ఏదో రకంగా సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కుతున్నారు. ఇక గుమ్మనూరు జయరాం విషయానికొస్తే తన సోదరుడు పేకాట స్థావరాలను నడుపుతున్నాడని తీవ్ర విమర్శలు చేశారు లోకేష్.అన్నీ తాను రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నట్లు పేర్కొన్న లోకేష్ అధికారంలోకి రాగానే గుమ్మనూరు విషయాన్ని తేల్చేస్తామని నాడు యువగళం సందర్భంగా నిప్పులు చెరిగారు. గుమ్మనూరు జయరాం నియోజకవర్గాన్ని గాలికొదిలేసి తాను మాత్రం బెంజ్ కారులో షికారు కొడుతున్నారంటూ నాడు లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

జితేంద్ర గౌడ్ వర్గం సహకరిస్తుందా..
కట్ చేస్తే.. గుమ్మనూరు జయరాంకు వైసీపీలో టికెట్ దక్కలేదు. ఇక టీడీపీతో టచ్లోకి వచ్చి గుంతకల్లు నిజయోకవర్గం నుంచి సీటు హామీని పొందారు. వాస్తవానికి గుంతకల్లు నియోజకవర్గం నుంచి జితేందర్ గౌడ్ కొన్నేళ్లుగా టీడీపీకి సేవలందిస్తున్నారు. ఇప్పుడు గుమ్మనూరు ఎంట్రీతో జితేందర్ గౌడ్ పొలిటికల్ ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే అక్కడ టీడీపీలో వర్గపోరు ప్రారంభమైంది. జితేందర్ గౌడ్ వర్గం ముమ్మాటికీ గుమ్మనూరు జయరాంకు మద్దతు ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పేశారు. అంతేకాదు మంగళవారం పట్టణంలో జితేందర్ గౌడ్కే టికెట్ కేటాయించాలని నినదించారు.
గుంతకల్లో గుమ్మనూరుకు షాక్.. సపోర్ట్ చేయమన్న జితేందర్ గౌడ్ వర్గం..!!#GummanuruJayaram #JithenderGoud #YSRCP #TDP #Guntakal #Oneindiatelugu pic.twitter.com/7erSz13WzU
— oneindiatelugu (@oneindiatelugu) March 6, 2024
ఇక గుమ్మనూరు ఎంట్రీతో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి కలిసి వచ్చింది. ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై గుంతకల్లు నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ సారి గెలుపు కష్టమే అనుకుంటున్న సమయంలో వెంకట్రామిరెడ్డికి గుమ్మనూరు రూపంలో లైన్ క్లియర్ అయ్యేలా కనిపిస్తోంది. గుంతకల్లో గుమ్మనూరుకు బంధుగణం ఉందని, అంతేకాకుండా తన బోయ సామాజిక వర్గం దాదాపుగా 25శాతం ఉందని ఈ రెండు అంశాలు తన గెలుపునకు కృషి చేస్తాయనే ధీమాతో ఉన్నారు. గుంతకల్లు గెలుపోటములను డిసైడ్ చేసేది బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే.
మొత్తానికి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు ప్రజలు జై కొడతారా.. మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ సహకరిస్తారా, లేక స్థానికంగా నివాసం ఉండే ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి నియోజకవర్గ ప్రజలు మరో అవకాశం ఇస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.












Click it and Unblock the Notifications