టీడీపీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో వివరించిన కొడాలి నాని..!!
Kodali Nani: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దీనితో పాటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ- ప్రతిపక్ష టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పరం ఘాటు విమర్శలను సంధించుకుంటోన్నారు. సవాళ్లు- ప్రతిసవాళ్లూ విసురుకుంటోన్నారు.
తాజాగా- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. గుడివాడలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని అన్నారు.

ఒంటరిగా పోటీ చేస్తే గెలవననే ఉద్దేశంతోనే ఇంటికి వెళ్లి మరీ జనసేన అధినేత పవన్ కల్యాణ్తో పొత్తు పెట్టుకున్నాడని మండిపడ్డారు. మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానంటూ గతంలో మాయమాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అదే బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తోన్నాడని గుర్తు చేశారు. అమిత్ షా డిమాండ్లన్నింటికీ తలవంచి మరీ పొత్తు పెట్టుకున్నాడని విమర్శించారు.
ఎన్నికల ఫలితాలు వెలువడే రోజైన జూన్ 4వ తేదీ తరువాత చంద్రబాబు పేరు గానీ, తెలుగుదేశం పార్టీ పేరు గానీ తలుచుకునే వారెవరు ఉండరని అన్నారు. వలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా వలంటీర్లు అద్భుతంగా పని చేశారని, సంక్షేమ పథకాలన్నింటినీ సకాలంలో ప్రజలకు ఇళ్ల వద్దకే అందించారని అన్నారు.

వలంటరీ వ్యవస్థను ఎన్నికల్లో ఉపయోగించుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని కొడాలి నాని చెప్పారు. ఏది మంచో వారికి తెలుసనని, అదే ప్రజలకు చెబుతారని పేర్కొన్నారు. అయిదేళ్లుగా ప్రజల ప్రతి అవసరాలు తీరుస్తోన్న వలంటీర్లపై చంద్రబాబు, పవన్ నోటికొచ్చినట్లు అవమానకరంగా మాట్లాడారని ఆయన పేర్కొన్నారు.
తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామంటూ చంద్రబాబు చెబుతున్నాడని, ఆయన మాటలను జనం నమ్మబోరని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వమే ఏర్పడితే జన్మభూమి కమిటీలను తిరిగి వస్తాయని, అందులో తమ కార్యకర్తలను పెట్టుకొని వారికి ప్రభుత్వం నుంచి జీతాలు ఇస్తాడని కొడాలి నాని ఆరోపించారు.












Click it and Unblock the Notifications