ఎమ్మెల్యే అభ్యర్థి సూసైడ్యత్నం, జగన్ అభ్యర్థిపై కేసు
వరంగల్/గుంటూరు/ఖమ్మం: వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాంగ్రెసు అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన వరంగల్లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెండ్యాల దగ్గర మామిడితోటలో ఆయన నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. శ్రీధర్ ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, ఆర్థిక ఇబ్బందులు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.
జగన్ పార్టీ అభ్యర్థిపై కేసు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పొన్నూరు అభ్యర్థి రావి వెంకటరమణ పైన నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదయింది. ప్రత్యేక పోలీసు బృందం ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టింది. రావికి చెందిన స్పిన్నింగ్ మిల్లులో పోలీసులు భారీగా మద్యం పట్టుకున్నారు. అప్పటి నుండి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన సోమవారం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దానిని కోర్టు స్వీకరించలేదు.
డబ్బులు పంచుతూ పోలీసులకు చిక్కిన జగన్ పార్టీ కార్యకర్తలు
ఖమ్మం జిల్లా జయనగర్ కాలనీలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు డబ్బులు పంచుతూ పోలీసులకు చిక్కారు. పోలీసులు వారి నుండి రూ.95 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
డ్రెయిన్లో మద్యం సీసాలు
గుంటూరు జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. పొన్నూరు వద్ద తుంగభద్ర డ్రెయిన్లో గుర్తు తెలియని వ్యక్తులు మూడువందల ఇంపాక్ట్ మద్యం సీసాలను పడేశారు. ఇటీవల పొన్నూరులోని స్పిన్నింగ్ మిల్లులో ఇదే తరహా మద్యం సీసాలు లభ్యమయ్యాయి.