మైనస్ లోకేష్: టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గుడ్బై: జగన్ సమక్షంలో వైసీపీ కండువా
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. పెద్దగా కలిసి రావట్లేదు. టీడీపీకి ఇది ఏ విధంగానూ ప్లస్ కావట్లేదనే అభిప్రాయాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. పార్టీకి, కిందిస్థాయి క్యాడర్లో జోష్ నింపాల్సిన, ఊపు తీసుకుని రావాల్సిన యువగళం- నీరసిస్తోందనే ప్రచారం జరుగుతోంది.
దీన్ని బలపరిచేలా టీడీపీ సీనియర్ నాయకుల నిర్ణయాలు కూడా ఉంటోండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య గుడ్బై చెప్పడం టీడీపీలో కలకలం రేపుతోంది. నారా లోకేష్ వ్యవహార శైలి, పాదయాత్రలో ఆయన చేస్తోన్న ప్రసంగాలు మైనస్గా మారుతున్నాయని స్పష్టమౌతోంది.

పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిథ్యాన్ని వహించారు తలే భద్రయ్య. ఆవిర్భావం నుంచీ టీడీపీలో కొనసాగుతూ వచ్చారు. 1985, 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయం సాధించారు. నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం కావడంలో కీలక పాత్ర పోషించారు.
కొంతకాలంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకుంటోన్న పరిణామాల నేపథ్యంలో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. కొద్దిసేపటి కిందటే తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన సమక్షంలో పార్టీ కండువాను కప్పుకొన్నారు. తన తనయుడితో సహా వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.

తలే భద్రయ్య, ఆయన కుమారుడికి వైఎస్ జగన్ పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనకాపల్లి టీడీపీ సీనియర్ నేత మలశాల భరత్ కుమార్, విశాఖ డెయిరీ డైరెక్టర్ రమణారావు, మాజీ ఎంపీపీ ధనమ్మ కూడా వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.












Click it and Unblock the Notifications