చిరుకు షాక్: నలుగురు ఎమ్మెల్యేలు టిడిపిలోకి?
హైదరాబాద్: గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ టికెట్పై విజయం సాధించిన నలుగురు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో తెలుగుదేశం అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు చేపట్టనున్న ఆత్మగౌరవ యాత్ర సందర్భంగా విశాఖపట్నం జిల్లాలో జరిగే కార్యక్రమంలో ఒక మంత్రితో పాటు మరో ముగ్గురు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరుతారని అంటున్నారు.
గత శాసనసభ ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవ ర్గం నుంచి గెలిచి, ప్రస్తుతం మంత్రి పదవిలో కొనసాగుతున్న గంటా శ్రీనివాసరావు తో పాటు ముత్తంశెట్టి శ్రీనివాసరావు(బీమిలి), రమేష్బాబు(పెందుర్తి), సీహెచ్ వెంకట్రామయ్య(గాజువాక)లు తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడంతో సాంకేతికంగా ఆ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ తమకు తగిన ప్రాధాన్యం లభించడం లేదనే అసంతృప్తితో వారున్నారు. విలీనం సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని, తాజాగా రాష్ట్ర విభజనను ప్రకటించి మరింతగా అభాసుపాలైందని, ఆ పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు వుండబోదని వారు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తొలుత వైయస్సార్ కాంగ్రెసు చేరాలనే దిశగా కసరత్తు జరిగింది. అయితే, మారిన పరిస్థితుల్లో తమ ఉద్దేశ్యాన్ని వారు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం మాతృ సంస్థ కావడంతో సులభంగా ఇమిడిపోవచ్చనే ఆలోచనతో వారు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications