ఘోర ప్రమాదం: కారును డీకొన్న లారీ, నలుగురు అక్కడికక్కడే మృతి, మరో నలుగురికి గాయాలు
తూర్పుగోదావరి: జిల్లాలోని సామర్లకోట వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దాపురం ఏడీబీ రహదారిపై కారును లారీ వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదంతో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వెళుతుండగా ప్రమాదం జరిగింది. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పెనుగుదురు నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటోను ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి
Recommended Video
ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని గరిటయ్యకాలనీ వద్ద కూలీలతో వెళుతున్న ఆటోను.. వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అద్దంకి నుంచి ఇంకొల్లు మండలం కొనంకికి కూలీలు మిరపకాయల కోతకు వెళుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు అద్దంకి మౌలా నగర్కు చెందిన అనసూయమ్మ, షేక్ కరీమూన్గా గుర్తించారు. గాయపడినవారిని అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.