డబ్బులు రాలేదని ఏటీఎంను ధ్వంసం చేసిన కానిస్టేబుల్
ఓ కానిస్టేబుల్ తనకు ఏటీఎం నుంచి డబ్బులు రాకపోవడంతో దాన్ని ధ్వంసం చేశాడు.
విశాఖపట్నం: పెద్ద నోట్లు రద్దు కావడంతో తెల్లారిస్తే బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరుతున్నారు. పెద్ద సంఖ్యలు జనం ఉంటే చివరి వరకు డబ్బులు అందడం లేదు. బ్యాంకులు, ఏటీఎంలలోనూ ఇదే పరిస్థితి. దీంతో కొందరు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఓ కానిస్టేబుల్ తనకు ఏటీఎం నుంచి డబ్బులు రాకపోవడంతో దాన్ని ధ్వంసం చేశాడు.
వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం జిల్లాలోని పాడేరులో ప్రజలు డబ్బులు తీసుకోవడానికి ఒకే ఒక్క స్టేట్ బ్యాంక్ ఏటీఎం కేంద్రం ఉంది. రాత్రి డబ్బులు తీసుకోవడానికి ఆ ఏటీఎం వద్దకు వచ్చిన కానిస్టేబుల్ కొద్ది సేపు వరుసలో నిలబడ్డాడు. కాగా, అతని వంతు వచ్చేసరికి ఆ మిషిన్ పని చేయలేదు. దీంతో తన కోపాన్ని పట్టలేక ఏటీఎంను నాలుగైదు సార్లు తన్నేశాడు.
అయినా అతని కోపం తగ్గకపోవడంతో బయటికి వెళ్లి పరుగెత్తుకుంటూ వచ్చి తన్నేశాడు. దీంతో అక్కడున్న రెండు ఏటీఎం యంత్రాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న బ్యాంకు సిబ్బంది ఏటీఎం సెంటర్కు తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో ఉన్న ఒక్క ఏటీఎంను మూసివేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, సీసీ కెమెరాల్లో నమోదైన కానిస్టేబుల్ దాడి దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.