గడప గడపకు మన ప్రభుత్వం - వైసీపీ ఎమ్మెల్యేలకు పరీక్షగా : తాజా ఉత్తర్వులతో...!!
ఈ రోజు నుంచి వైసీపీ ఎమ్మెల్యేలంతా ప్రజల మధ్యనే ఉండాలి. ఈ కార్యక్రమానికి గడపగడపకు వైసీపీ అని తొలుత డిసైడ్ చేసారు. కానీ, చివరి నిమిషంలో ఈ కార్యక్రమం పేరు గడప గడపకు ప్రభుత్వంగా ఖరారు చేసారు. ఈ మేరకు మార్గదర్శకాలతో ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి కావటంతో..ఇక, ఎన్నికల వరకు ఎమ్మెల్యేలతో సహా.. పార్టీ శ్రేణులు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ నిర్దేశించారు.
పార్టీ కాదు..ప్రభుత్వ కార్యక్రమంగా
అందులో భాగంగా.. ప్రతీ ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలోని ప్రతీ ఇంటికి వెళ్లి.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటుగా... ఆ ఇంటికి అందుతున్న పథకాలు..లబ్ది గురించి వివరించనున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్ రాసిన లేఖను అందించనున్నారు. ప్రతిపక్షాలు..వారి మద్దతు మీడియా ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలు .. ఆరోపణలను సైతం ఖండిస్తూ లబ్ది దారులకు తమ లక్ష్యాలను వివరించనున్నారు. పార్టీ పరంగా తొలుత భావించిన ఈ కార్యక్రమంలో అధికారులు భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు సిద్దం చేసారు. అయితే, అధికారులు పాల్గొనాల్సి ఉండటంతో..వివాదాలకు అవకాశం లేకుండా దీనిని ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా మార్చుతూ ఉత్తర్వులు ఇచ్చారు.
95 శాతం హామీలు అమలు అయ్యాయంటూ
అదే సమయంలో ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 95 శాతం హామీలను క్లియర్ చేసినట్లుగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాల కలెక్టర్లు ఖరారు చేసిన షెడ్యూల్ను అనుసరించి ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ప్రతి ఇంటినీ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ఎమ్మెల్యేలు సందర్శించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు. ఇక, కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంతో పాటుగా ఎమ్మెల్యేల పని తీరు పైన క్షేత్ర స్థాయిలో సర్వేలు చేయించినట్లుగా తేల్చారు. అందులో ప్రభుత్వం పైన ప్రజల్లో సానుకూలత ఉండగా.. కొందరు ఎమ్మెల్యేల పైన మాత్రం వ్యతిరేకత ఉన్నట్లుగా తేలింది.
ఎమ్మెల్యేల సమర్ధతకు పరీక్షగా
దీంతో.. అటువంటి ఎమ్మెల్యేలు తమ పని తీరు మార్చుకోవటానికి.. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని సీఎం జగన్ నిర్దేశించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తే..ఇక, టీడీపీ ఉండదనేది వైసీపీ నేతల అంచనా. ఎమ్మెల్యేల పనితీరు మెరుగు పరుచుకుంటేనే..వారి గ్రాఫ్ పెరిగితేనే టిక్కెట్లు వస్తాయని సీఎం స్పష్టంగా చెప్పారు. గ్రాఫ్ పెరగని వారికి టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. అయితే, ఏ ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో పని చేయటం లేదనేది వెల్లడించలేదు.
ర్యాంకింగ్ మెరుగైతేనే..టికెట్ కేటాయింపు
కానీ, ప్రాంతీయ సమన్వయకర్తల ద్వారా ఆ ఎమ్మెల్యేలు పని తీరు మెరుగు పరచుకొనే విధంగా సూచనలు చేయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ప్రాంతీయ - జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న వారు పార్టీ ఎమ్మెల్యేలతో సమీక్షలు చేస్తున్నారు. ఈ రోజు ప్రారంభం అయ్యే గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణపైన ప్రతీ రోజూ సీఎం కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసారు. దీంతో..ఇప్పుడు ఈ కార్యక్రమం వైసీపీ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్ కు కీలకంగా మారనున్నాయి.