గెయిల్ ట్రాజెడీ: కాస్తా ఆలస్యమైతే ఘోరమే (పిక్చర్స్)
రాజమండ్రి: కాస్తా ఆలస్యంగా ప్రమాదం సంభవించి ఉంటే మరింత దారుణంగా ఉండేది. తూర్పుగో గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో తెల్లవారు జామున ప్రమాదం జరిగి, మంటలు ఎగిసిపడి 16 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే
గాలివాటం, ప్రమాదం జరిగిన సమయం, ఇతరత్రా కొన్ని కారణాల వల్ల ప్రమాద తీవ్రత కొంత ప్రాంతానికే పరిమితమైందని అంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో గ్యాస్ భగ్గుమంది. అదే పూర్తిగా తెల్లవారాక ప్రమాదం జరిగి ఉంటే ప్రాణనష్టం తీవ్రంగా ఉండేదని అంటున్నారు. మంటలు మొదలైన హోటల్తోపాటు చుట్టుపక్కన ఉన్న దుకాణాలు, మరో హోటల్ వద్ద గుమికూడే జనం కూడా మంటల్లో చిక్కుకునే వారు.
తక్కువ ఒత్తిడితో..
ప్రమాదానికి మూలకారణమైన పైప్లైన్ నుంచి కొండపల్లిలోని ల్యాంకో పవర్కు సహజ వాయువు సరఫరా అవుతుంది. ఇటీవలి దాకా 500 మెగావాట్ల ఉత్పత్తికి సరిపడా ఒత్తిడితో గ్యాస్ సరఫరా అయ్యేది. అయితే ఇటీవల తలెత్తిన గ్యాస్ ధరల వివాదం, ఇతరత్రా కారణాలతో ఉత్పత్తిని 75 మెగావాట్లకు తగ్గించారు. దీంతో తక్కువ ఒత్తిడితో గ్యాస్ సరఫరా చేస్తున్నారు.
గంటపాటు ప్రమాదం
నగరం గ్రామంలో సుమారు గంట నుంచి గంటన్నర పాటు లీక్ అయిన గ్యాస్ వల్లే ఈ స్థాయి ప్రమాదం జరిగిందని అంచనా. భారీ ఒత్తిడితో గ్యాస్ సరఫరా జరిగి, లీక్ అయి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.
అక్కడి వరకే..
పైప్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్న సమయంలో గాలివాటం తూర్పు దిశగా ఉంది. దీంతో గ్యాస్ మొత్తం పైప్ నుంచి తూర్పువైపున కేంద్రీకృతమైంది. మంటలు అక్కడే వ్యాపించాయి.
పడమర వైపు...
పడమర వైపు రెండు పాఠశాలలు ఉన్నాయి. ఉత్తరం వైపు అరకిలోమీటరు దూరంలో ఆయిల్ రిఫైనరీ, గ్యాస్ కలెక్టింగ్ సెంటర్ (జీసీఎస్) ఉన్నాయి. మంటలు ఇటువైపు వ్యాపించి ఉంటే రిఫైనరీ, జీసీఎస్ ప్రమాదంలో చిక్కుకుని ఉంటే నష్టం ఊహించని స్థాయిలో ఉండేదని శనివారం వార్తలు వచ్చాయి.
సమీపంలోనే ఉన్న జాతీయ రహదారిపైనా అప్పటికి రాకపోకలు పెరిగేవి. అన్నింటికంటే ముఖ్యంగా భారీ విస్ఫోటనం జరిగిన ప్రాంతానికి మూడువైపులా మూడు పాఠశాలలు ఉన్నాయి. జీసీఎస్ సమీపంలో కొబ్బరి తోటలను ఆనుకుని శ్రీచైతన్య పాఠశాల ఉంది. ఇందులో 1800 మంది చదువుకుంటున్నారు.
మరోవైపున ఉన్న శ్రవణ్య స్కూలులో 250 మంది, గీతాంజలి పాఠశాలలో 150 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలవైపు మంటలు వ్యాపించనప్పటికీ బడి వేళలో అటూ వైపు వచ్చే పిల్లలు, వారిని తీసుకొచ్చే పెద్దలు ప్రమాదంలో చిక్కుకునే వారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో ఇంత ఘోరం తప్పిపోయింది.