ఏదో వింతగా జగన్ సాక్షి: తిరుమలలో హెరిటేజ్పై గాలి
హైదరాబాద్: తిరుమలలో 'హెరిటేజ్' పునర్ నిర్మాణం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. తిరుమలలో హెరిటేజ్ పార్లర్ ఉండటాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. దీని పైన టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఘాటుగా స్పందించారు.
తిరుమలలో హెరిటేజ్ పార్లర్ను పునర్నిర్మించడమే తప్ప కొత్తగా పెట్టింది కాదన్నారు. దొడ్ల, జెర్సీ, మదర్, సంగం, బాలాజీ డైరీలు ఈ ప్రాంతంలో తమ పాల వ్యాపారాలను చేస్తున్నాయని, వాటితో పాటు హెరిటేజ్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇందులో వింతేమిటని ప్రశ్నించారు.
తిరుమలలో హెరిటేజ్ పార్లర్ పెట్టడం ద్వారా ఏదో జరిగిపోయినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికలో కథనాలు రాయడం సరికాదన్నారు. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జీఈవోతో కలిసి హెరిటేజ్ పార్లర్ తొలగించారన్నారు. ఇప్పుడు దానిని పునర్ నిర్మించామన్నారు. అవినీతిపరుడైన జగన్కు అన్నీ అలాగే కనిపిస్తాయన్నారు.
తిరుమలలో దర్శనానికి నాలుగు గంటలు
తిరుమలలో శ్రీవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలు, కాలినడక భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది.