గ్యాంగ్ రేప్: స్నేక్ గ్యాంగ్ పనే, ఇదంటే హడల్
హైదరాబాద్: హైదరాబాదులోని పహడీషరీఫ్లో కాబోయే భర్తను భయపెట్టి మోకాళ్లపై కూర్చోబెట్టి, యువతిని వివస్త్రను చేసి, ఆమెను పాముతో బెదిరించి ఏడుగురు సామూహిక అత్యాచారం చేసింది స్నేక్ గ్యాంగ్ పనే అని వెల్లడైంది. ఆ గ్యాంగ్ చేసిన పనులు ఒక్కటొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. ఫైసల్ దయానీ, ఖాదర్ బారక్ బా, తయ్యబ్ బాసలామా, మహ్మద్ పర్వేజ్లకు అకృత్యాలు మామూలేనని అంటున్నారు. వారు చేసిన పనులు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
చేసిన అకృత్యాలను సెల్ఫోన్లలో చిత్రీకరించడం ఆ స్నేక్ గ్యాంగ్కు సరదా అని చెబుతున్నారు. నగ్నంగా ఫోటోలు తీయడం, బెదిరించడం, రౌడీయిజం వారి పని అంటున్నారు. కాగా, ఈ స్నేక్గ్యాంగ్ అకృత్యాల విషయంలో ఒక కొత్త విషయం బయటపడింది. ఈ కేసులో నిందితుల్లో ఒకడైన ఖాదర్ బారక్బా తండ్రి అలీ బారక్బా తన కొడుకు స్నేహితులైన ముగ్గురు నిందితులకు ఆశ్రయం కల్పించాడని ఆరోపణలు వచ్చాయి.
వారిని దాచిపెట్టి, పోలీసుల కంటపడకుండా నేరుగా కోర్టులో లొంగిపోయేలా అతను చేశాడని సోమవారం మీడియాలో వార్తలు వచ్చాయి. జూలై 31న హైదరాబాద్ శివార్లలోని ఒక ఫామ్హౌస్లో మహిళపై దయానీ బృందం అత్యాచారం చేసిన తర్వాత నిందితులు సలామా, ఎండీ పర్వేజ్, ఎండీ ఇబ్రహీం, ఖాదర్ బారక్బ, సయ్యద్ అన్వర్, ఖాజా అహ్మద్ పరారయ్యారు. వీరిలో సలామా, పర్వేజ్, ఇబ్రహీంలను ఖాదర్ బారక్బా తండ్రి ఆలీ బారక్బ ఏడో తేదీన కోర్టులో లొంగిపోయేలా చేశాడు. వారికి ఆశ్రయం కల్పించి రహస్యంగా కోర్టుకు తీసుకెళ్లాడు.
దయాని గ్యాంగ్ గురించి తవ్వేకొద్దీ నేరాల చిట్టా బయట పడుతోంది. మహిళలపై అఘాయిత్యాలే కాకుండా వీరు భూకబ్జాలకూ పాల్పడుతున్నారని సమాచారం. ఇందుకోసం వీరంతా రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద గుమస్తాలుగా పనిచేస్తున్నారు.
మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం - పహాడీషరీఫ్ ప్రాంతంలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంది. ఇక్కడ చెట్లు, పొదల నుంచి పాములు ఖాళీ ప్రదేశాల్లోకి వస్తుంటాయి. జిమ్ కోచ్, స్నేక్ గ్యాంగ్ లీడర్ అయిన ఫైసల్ దయాని అతడితోపాటు ఖాదర్ బారక్బ ఆ పాములను పట్టుకుని వాటి కోరలను తీసేస్తారు. తర్వాత వాటిని భద్రపరిచి రాత్రిపూట బయటకు తీస్తారు. సాలం హందీ, ఫైసల్ దయాని భూకబ్జాల్లో బాగా డబ్బు సంపాదించిన నేపథ్యంలో ఆ పాములను దగ్గర పెట్టుకుని ఖరీదైన వాహనాల్లో తిరుగుతుంటారు. వీరితోపాటు ఖాదర్ కూడా ఉంటాడు.
ఎవరినైనా టార్గెట్ చేసిన తర్వాత వీరు సలామా, పర్వేజ్, ఇబ్రహీంలకు ఫోన్లో సమాచారమిస్తారు. జూలై 31న వీరిలో ఒకడు ఇదే రీతిలో తిరుగుతూ ఫాంహౌస్లో కాబోయే భార్యాభర్తలు ఒంటరిగా ఉండడాన్ని గమనించాడు. తర్వాత మిగిలిన వారికి సమాచారమివ్వడంతో దయాని, సాలం హందీ పామును వెంటబెట్టుకుని ఫాంహౌస్లోకి ప్రవేశించి దుర్మార్గానికి పాల్పడ్డారు.
మహిళా కమిషన్ స్పందన
ఇదిలావుంటే, హైదరాబాదు పాతబస్తీలోని పహడీషరీఫ్ స్నేక్ గ్యాంగ్ చేసిన నేరాలపై మహిళా కమిషన్ స్పందించింది. ఫామ్హౌస్లో అత్యాచారం చేసిన ఘనటపై నివేదిక ఇవ్వాలని కమిషన్ పోలీసులను ఆదేశించింది. ఈ గ్యాంగ్ మహిళలపై చేసిన నేరాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని కమిషన్ సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్కు ఆదేశాలు జారీ చేసింది.