టార్గెట్ వల్లభనేని వంశీ - గన్నవరం వైసీపీ కార్యకర్తల ఫిర్యాదు: పార్టీని బతికించండి..!!
ఏపీ రాజకీయాల్లో భారీ ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీలో ఎన్నికలకు ముందే అంర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కుతున్నాయి.టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి..వైసీపీకి వంశీ దగ్గరైన సమయం నుంచి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు.. సీనియర్ నేత రామచంద్రరావు మద్దతు దారులు అసంతృప్తి వ్యక్తం చేసారు. పలు సందర్భాల్లో వంశీ వర్సెస్ వెంకటరావు మద్దతు దారుల నిరసనలు చోటు చేసుకున్నాయి. అయితే, పార్టీ అధినాయకత్వం సూచనతో వివాదం తాత్కాలికంగా సర్దుమణిగింది.

వంశీ కి వ్యతిరేకంగా ఫిర్యాదు
2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావుకు 13043 ఓట్లు రాగా.. టీడీపీ నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీకి 103881 ఓట్లు వచ్చాయి. 800 ఓట్ల మెజార్టీతో వంశీ గెలుపొందారు. ఇక, ఇప్పుడు గన్నవరం వైసీపీ కార్యకర్తలు వంశీకి వ్యతిరేకంగా లేఖ రాసారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డికి ఆ లేఖ పంపినట్లుగా వైరల్ అవుతోంది. గన్నవరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలు వల్లభనేని వంశీకి ఇవ్వద్దంటూ సాయిరెడ్డిని కోరారు. ఈ మేరకు ఒక సుదీర్ఘంగా లేఖలో వివరించారు. తొమ్మిదేళ్ల కాలంలో పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసామని లేఖలో పేర్కొన్నారు. జగన్ ను మరోసారి సీఎంను చేసుకుంటామంటూ లేఖలో రాసుకొచ్చారు.

30 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాం
తమ మీద అక్రమంగా పెట్టిన కేసుల విషయంలో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు. వంశీ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో తన అనుచరులతో పెత్తనం చేస్తున్నారని ఫిర్యాదు చేసారు. వంశీ కాకుండా ఎవరిని నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా నియమించినా తమకు సమ్మతమే అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నియోజకవర్గంలో తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా వంశీ అనుచరులకే స్థానిక పదవులు కట్టబెట్టారని ఫిర్యాదు చేసారు. నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా.. పార్టీ అభ్యర్ధి 30 వేల పైగా మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు.

సీఎం జగన్ ఏం చేయబోతున్నారు
ఇక, అటు టీడీపీ సైతం ఇప్పుడు గన్నవరం పైన ఫోకస్ పెట్టింది. క్రిష్ణా జిల్లాలో గుడివాడ - గన్నవరం లో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలిచి.. కొడాలి నాని - వల్లభనేని వంశీలను ఓడించాలనేది పార్టీ అధినేత లక్ష్యంగా చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు వీరిద్దరి విజయం వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఈ సమయంలోనే గన్నవరం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు వంశీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటం పార్టీలో చర్చకు కారణమైంది. ఈ విషయంలో సీఎం జగన్ అంతిమంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications