రిషికేశ్వరి కేసు: ఎవర్నీ వదిలిపెట్టబోమన్న మంత్రి, సుమోటోగా స్వీకరించారు
విశాఖపట్నం: నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహాత్య చేసుకుని మృతి చెందిన బీటెక్ ఆర్టికెట్ విద్యార్ధిని కేసులో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
గురువారం ఆయన ఓ ప్రముఖ టీవీ ఛానెల్తో మాట్లాడారు. ప్రిన్సిపాల్ బాబూరావు నైట్ పార్టీలో విద్యార్ధులతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను చూశాకే సస్పెండ్ చేయమని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. రిషికేశ్వరిది ఆత్మహత్యా లేదా ప్రేరేపిత హత్యా అనేది అనే కోణాల్లో కూడా దర్యాప్తు చేయమని పోలీసులను ఆదేశించామని అన్నారు.
విచారణలో పూర్తి వాస్తవాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. దిలాస్ట్ నోట్ పేరుతో రిషికేశ్వరి రాసిన లేఖ తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి పేర్కొన్నారు. రిషికేశ్వరి మృతిపై యూనివర్సిటీ నిజ నిర్ధారణ కమిటీని వేసింది. గురువారం విచారణ జరుపుతున్న నిజ నిర్ధారణ కమిటీ సభ్యులకు ప్రిన్సిపాల్ బాబూరావు హాయ్ల్యాండ్లో జరిగిన పార్టీ సీడీలను అందించారు.
రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఆయనను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రిషికేశ్వరి ర్యాగింగ్ వల్లే చనిపోలేదని, సహవిద్యార్థుల, లైంగిక వేధింపులు కూడా కారణమని తెలియడంతో ఈ కేసును సుమోటోగా గుంటూరు జిల్లా లీగల్ సెల్ అథారిటి స్వీకరించింది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపల్ బాబూరావు, వార్డెన్ స్వరూపారాణికి లీగల్ సెల్ అథారిటి శుక్రవారం నోటీసులిచ్చింది. ర్యాగింగ్ కారణంగా నాగార్జున యూనివర్సిటి విద్యార్థి రిషికేశ్వరి మృతి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
రిషికేశ్వరి మృతికి అసలు కారణం ఇదే?
ర్యాగింగ్ పేరుతో ఓ సీనియర్ విద్యార్ధిని హాస్టల్ గదిలో రిషికేశ్వరిని అర్ధనగ్నంగా తిప్పుతూ మొబైల్లో చిత్రీకరించింది. ఈ వీడియోను ట్రైనీ లెక్చరర్కు, సీనియర్ విద్యార్థికి మొబైల్ ద్వారా షేర్ చేసింది. తమ సెల్ఫోన్లలో ఉన్న దృశ్యాలను చూపించి రిషికేశ్వరిని లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రుషికేశ్వరి నేరుగా హాస్టల్ గదికి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో బయటపడ్డాయి.